క్రిస్టియన్ సెంట్రిక్‌గా బీజేపీ పాలిటిక్స్!

ఆశ్చర్యం లేదు.. అనుమానం కూడా లేదు! హిందూత్వ బ్రాండును పుణికి పుచ్చుకున్న బీజేపీ.. అవకాశం, అవసరం అనే కోణంలో ఇప్పుడు క్రిస్టియన్ సెంట్రిక్‌గా రాజకీయాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో కులం, మతం ఆధారంగా ఎక్కువగా ఓట్లు పడే ఏకైక రాష్ట్రం కేరళ. ఇక్కడ క్రిస్టియానిటీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం కేరళలో క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న వారి సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం 30 శాతానికి పైగానే ఉంది.

ఈ నేపథ్యంలో క్రిస్టియానిటీకి రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. హిందూత్వ కార్డుతో రాజకీయాలు చేసే బీజేపీ ఇక్కడ మాత్రం ఆ కార్డుకు రెండో వైపు క్రిస్టియానిటీని తగిలించుకుంది. ఈ నేపథ్యంలోనే క్రిస్టియన్ మత గురువులతో ఇటీవల ప్రధాని మోదీ అత్యంత గోప్యంగా నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఫోటోలు వెలుగు చూడడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిలో మెజారిటీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ఇప్పుడు ఇంట్రెస్ట్ రాజకీయంగా మారింది.

ఓటు బ్యాంకు రాజకీయం!

ఆది నుంచి కూడా క్రిస్టియన్లు కాంగ్రెస్‌కు మొగ్గు చూపుతున్నారు. ఏకే ఆంటోనీకి కేంద్రంలో కీలక పదవులు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహాన్నే అనుసరించింది. అయితే ఆంటోనీ వయస్సు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు అనిల్ ఆంటోనీని తనవైపు తిప్పుకున్న బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలను కూడా అప్పగించింది. ఇప్పుడు ఏకంగా బిషప్‌లతో భేటీ కావడం ద్వారా క్రిస్టియన్ ఓటు బ్యాంకును చీల్చి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

అంతేకాదు.. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలను దగ్గర చేసుకోవడంతో సహజంగానే ఏర్పడే క్రిస్టియన్ల అసంతృప్తిని తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్‌లో ప్రముఖ నటుడు సురేష్ గోపి బీజేపీ తరఫున విజయం సాధించారు. ఇది క్రిస్టియన్ల ఐక్యతతోనే సాధ్యమైందని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఇటీవల తిరువనంతపురంలో కార్పొరేషన్ గెలవడం వెనుక కూడా ఇదే ఫార్ములా ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో హిందూత్వ కార్డును కొంతసేపు పక్కన పెట్టి క్రిస్టియన్ కార్డును బీజేపీ నాయకులు ప్రదర్శించడం గమనార్హం.

మరిన్ని కారణాలు..

కేరళలో బీజేపీ పుంజుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రధానంగా క్రైస్తవ సమాజంలో ఉన్న భయాలను మరింత పెంచి వారిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది.

ముస్లిం జనాభా పెరుగుదలతో తమకు ఇబ్బందులు వస్తాయనే భావనలో ఉన్న క్రైస్తవులకు కూడా జనాభా పెంచాలని పిలుపునిస్తోంది.
వక్ఫ్ బోర్డు భూములను ప్రస్తావిస్తూ.. క్రిస్టియన్ భూములను కాపాడతామని, ఎవరూ ఆక్రమించకుండా చూస్తామని ప్రచారం చేస్తోంది.
లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరు తమ మతాన్ని గౌరవించుకోవాలని ప్రత్యేకంగా చెబుతోంది.
క్రైస్తవ మత పెద్దలకు మద్దతుగా ఉంటామని చెబుతూ జెరూసలేం యాత్రలకు తిరువనంతపురం నుంచి నేరుగా విమానాలు నడిపించే ప్రణాళికలపై దృష్టి పెట్టింది.
స్థానిక పార్టీ పదవుల్లో క్రైస్తవులకు పెద్దపీట వేస్తోంది. కేంద్ర మంత్రి పదవిని కురియన్‌కు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అలాగే అనిల్ ఆంటోనీకి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని కూడా హైలైట్ చేస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని పదవులు ఇస్తామని ప్రకటిస్తోంది.

మొత్తంగా.. కేరళలో క్రిస్టియన్ సెంట్రిక్ రాజకీయాలు ఊపందుకున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.