జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా మారింది. జగన్ ను ఉద్దేశించి రెండు రోజుల కిందట తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. దీనిపై ఈ రోజు షర్మిల మాట్లాడారు.
‘నా అజెండా ఆస్తులు కాదు.. నిజం!’ అంటూ వైఎస్ జగన్పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావన వస్తే చాలు, వైసీపీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబాన్ని, తల్లిని కూడా విమర్శించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఆస్తుల కోసం పాకులాడడం లేదన్నారు. ఆస్తులు అనుభవించాలనే కోరిక తనకే ఉంటే ఎప్పుడో కోర్టు మెట్లు ఎక్కేదానినని షర్మిల స్పష్టం చేశారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది నేను కాదు.. జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపణలు చేశారు.
ఆస్తుల పంపకాలు, కుటుంబ పరిస్థితులపై తల్లి విజయమ్మ ఇచ్చిన లేఖను తప్పుబట్టడంపై షర్మిల ఘాటుగా స్పందించారు. ఒత్తిడి చేశాననడం హాస్యాస్పదం, “నేను ఒత్తిడి చేసి సంతకం చేయించానని ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ‘ఆ సంతకం నాది కాదు’ అని విజయమ్మ గారు చెప్పలేరా? ఆమెకు ఆ స్వేచ్ఛ లేదా?.. అని ప్రశ్నించారు.
లేఖలోని విషయాలు వాస్తవమని తెలుసు కాబట్టే జగన్ మాట్లాడటం లేదు. తన ‘సోషల్ మీడియా సైన్యం’ వెనుక దాక్కుని మొరుగుతున్నారు. నేరుగా వచ్చి మాట్లాడే ధైర్యం జగన్కు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి గారి ఫోటో పెట్టి, ‘సత్యమేవ జయతే’ అని బ్యానర్లు కట్టుకునే ‘సాక్షి’ పత్రికపై షర్మిల సెటైర్లు వేశారు.
“విజయమ్మ విడుదల చేసిన లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? సత్యం పట్ల, సొంత తల్లి మాటల పట్ల మీకున్న గౌరవం ఇదేనా?” అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలన్నదే తన ప్రధాన అజెండా అని, ఆస్తుల గొడవను ముందుకు తెచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడొద్దని షర్మిల హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates