ఆయన తొలిసారి విజయం దక్కించుకున్న నాయకుడు. అయితేనేం.. ప్రజల సమస్యలపై పట్టున్న నేత. ప్రజలతో కలివిడిగా ఉండే నాయకుడు. దీంతో ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేస్తున్నారు. సమస్యలపై స్పందిస్తున్నారు. ఇటు ప్రజలకు-అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా కూడా ఉంటున్నారు. ఎక్కడా ప్రచారాన్ని ఆశించడం లేదు. ఎలాంటి వివాదాలను కూడా కొని తెచ్చుకోరు. పని-ప్రజలు అనే నినాదాన్ని పైకి చెప్పకపోయినా.. కార్యాచరణలో మాత్రం పెడుతున్నారు.
ఆయనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు.. పంతం నానాజీ. గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న నానాజీ.. ప్రజల సమస్యలపై ఎంతో అవగాహనను ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు.. పార్టీపరంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. వివాద రహితంగా నానాజీ దూసుకుపోతున్నారన్నది కూడా వాస్తవం. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ.. కాకినాడ రూరల్ లో అలాంటి పరిస్థితులు లేవు.
అంతేకాదు..
నియోజకవర్గంలో పర్యటించే విధానం కూడా ఆసక్తిగా ఉంది. ఇతర నేతలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే.. హంగు ఆర్భాటం.. పెద్ద ఎత్తున ఉంటుంది. తమకు ముందొక పది మంది.. వెనుకొక పది మంది ఉంటారు. కానీ, నానాజీ విషయానికి వస్తే దీనికి భిన్నంగా ఉంది. ఆయన ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ఒక్కొక్కసారి కారులో కూడా కాకుండా.. వెళ్తుండడం గమనార్హం. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వారిని సంప్రదించేందుకు ఒంటరిగా వెళ్తే పరిస్థితులు మరింత అర్థం అవుతాయన్నది ఆయన భావన.
కూటమిలో నాయకుల మధ్య సఖ్యత విషయంలోనూ నానాజీ అదే తీరుగా స్పందిస్తున్నారు. ఎవరితోనూ వివాదాల జోలికిపోకుండా.. ఎవరితోనూ కీచులాడకుండా.. ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నియోజ కవర్గంలో వైసీపీ నాయకులు కూడా విమర్శించేందుకు ఎలాంటి సబ్జెక్టు లేనిరీతిలో వ్యవహరిస్తున్నారం టే.. ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ.. వాస్తవమేనని అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించడంలోనూ.. అసెంబ్లీలో నానాజీకి గుర్తింపు ఉండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates