వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. పెద్దా చిన్నా అనే బేధం లేదు. ఎవరు అందివస్తే.. వారిని మోసగించడమే!. వారి సొమ్మును కాజేయడమే. అది ఏ రూపంలో అయినా కావొచ్చు. ఇందుగలదందు లేదను సందేహం లేదు. సైబర్ మోసాలు ఏ రూపంలో అయినా.. విజృంభించవచ్చు. ఇదీ.. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ప్రజలకు సంకటంగా మారిన దుస్థితిని కళ్లకు కడుతోంది. శనివారం.. ఓ మాజీ డీజీపీ మనవరాలిని కోటి రూపాయలకు పైగా మోసం చేసిన ఉదంతం ఇంకా మరిచిపోకముందే.. ఏపీలో మరో మోసం జరిగింది.
అది కూడా సాక్షాత్తూ.. జనసేనపార్టీ ఎమ్మెల్యేనే సైబర్ ముఠా మాయ చేసి.. మోసం చేసేసింది. ఆయన ఖాతాను ఖాళీ చేసేసింది. ఏకంగా 12 లక్షల రూపాయల పైగానే సైబర్ ముఠా దోచిందని ఎమ్మెల్యే గగ్గోలు పెడుతున్నారు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే.. శనివారమే ఏపీ డీజీపీ హరీష్ కుమార్.. మీడియా సమావేశం పెట్టి.. సైబర్ నేరాలు.. వాటి తీరుతెన్నులు.. వివరించారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించారు. స్మార్ట్ ఫోన్లకు వచ్చే మెసేజ్లు.. లింకులను `టచ్` చేయొద్దని కూడా సూచించారు.
అయితే.. ఆ మర్నాడే.. అంటే ఆదివారం ఉదయం.. ఎమ్మెల్యే ఈ సైబర్ ముఠా వలలో చిక్కుకుని 12 లక్షల రూపాయలను పోగొట్టుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఆయన పోలీసులను ఆశ్రయించారు. కానీ, అప్పటికే విదేశీ ఖాతాల్లోకి ఆ సొమ్ము చేరిపోవడం.. అవి క్రిప్టో కరెన్సీగా మారిపోవడం జరిగిపోయాయి. అంటే.. ఇక ఆ సొమ్ము అంతే!!.
ఏం జరిగింది?
ఉదయం మంచం మీద నుంచి లేవగానే ఫోన్ చూసుకునే అలవాటు ఉన్న పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన నాయకుడు చిర్రి బాలరాజు.. ఆదివారం ఉదయం కూడా ఫోన్ చూసుకున్నారు. స్క్రీన్పై “మీ వాహనానికి జరిమానా విధించాం“ అని ఉన్న నోటిఫికేషన్ కనిపించింది. ఇది.. వాహనాల కు పోలీసులు విధించే చలానాల రూపంలో ఉండడంతో ఆయన దానిపై క్లిక్ చేశారు. అది ఓపెన్ అయింది.
కానీ.. వివరాలు ఏమీ లేవు. ఆ కాసేపటికి.. డబ్బులు అవసరమై.. ఫోన్ పే చేద్దామని చూస్తే.. జీరో బ్యాలెన్స్ చూపించింది. దీంతో వివరాల్లోకి వెళ్తే.. ఆయన నోటిఫికేషన్ను క్లిక్ చేసిన సమయంలోనే ఏకంగా 12 లక్షలు మ్యూల్ ఖాతాకు బదిలీ అయ్యాయి. దీంతో లబోదిబో మంటూ.. పోలీసులను ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదని పోలీసులు తేల్చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates