వైసీపీలో గుడివాడ పేచీ..!

వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ ఇదే దృష్టితో ఉంది. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన నేపథ్యమే. గత ఎన్నికల్లోనే ఆయన ఈ ప్రకటన చేశారు.

అయితే ఇప్పుడు ఈక్వేషన్లు మారాయని కొడాలి వర్గం చెబుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని సూచనలుగా కొడాలి నాని చెబుతున్నారు. అయితే అధిష్టానం అందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో కొడాలి పేరు పెద్దగా వినిపించడం లేదని, ఆయన ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారని వైసీపీ ఐటీ విభాగం చేసిన సర్వేలో తేలిందని సమాచారం. దీంతో బలమైన నాయకుడి కోసం వెతుకుతున్నారు.

ఇది కొడాలి వర్గానికి మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో ఏదో అనేశారని, ఇప్పుడు మనసు మార్చుకున్నారని, గెలుపు గుర్రం ఎక్కేందుకు మంచి అవకాశాలే ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు, కొడాలి వర్గం నుంచి హెచ్చరికలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. గుడివాడ బాధ్యతలు ఎవరికిచ్చినా సహకరించబోమని స్పష్టం చేస్తున్నారని సమాచారం. దీంతో పార్టీ పరంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఏర్పడింది.

అందుకే ఇతర నియోజకవర్గాల్లో తీసుకున్న చర్యలు, వేస్తున్న అడుగుల మాదిరిగా గుడివాడలో ప్రయత్నాలు కనిపించడం లేదు. అలాగని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ కొడాలికే టికెట్ ఇస్తారా అన్నది కూడా సందేహంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలను పార్టీ నిశితంగా గమనిస్తోంది. ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది.

ఎన్నికలకు ముందు వరకు కూడా దీనిపై నిర్ణయం వాయిదా వేయడం ద్వారా చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలోనే పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం నాని నియోజకవర్గంలోనే ఉన్నా మౌనంగా ఉన్నారు.