ఇండియాలో కూడా స్ట్రెయిన్ కలకలం

బ్రిటన్ను కుదిపేస్తున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ తాజాగా మనదేశంలో కూడా టెన్షన్ పెంచేస్తోంది. బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన విమానంలో 25 మందికి కరోనా వైరస్ ఉండటమే ఇందుకు ప్రధానకారణం. కరోనా వైరస్సే రూపాంతరం చెంది స్ట్రెయిన్ కరోనాగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా రూపం మార్చుకున్న కరోనా వైరస్ దెబ్బకు బ్రిటన్ తల్లకిందులైపోతోంది. కరోనా వైరస్ కన్నా స్ట్రెయిన వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది బ్రిటన్లో. దాంతో బ్రిటన్ ప్రభుత్వం మళ్ళీ దేశమంతా లాక్ డౌన్ ప్రకటించేసింది.

బ్రిటన్ లోవ్యాపిస్తున్న స్ట్రెయిన్ దెబ్బ ప్రపంచం మీద ఏ స్ధాయిలో ఉందంటే భారత్ తో సహా దాదాపు 15 దేశాలు విమాన రాకపోకలను నిషేధించేశాయి. బ్రిటన్లో ఉన్న తమ పౌరులను వెనక్కు వచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు పిలుపివ్వటం గమనార్హం. సరే ఈ విషయాలను వదిలేస్తే కొన్ని ప్రపంచదేశాల్లాగే భారత్ కూడా బ్రిటన్ కు విమాన రాకపోకలను నిషేధించింది. అయితే నిషేధం విధించేసమయానికే షెడ్యూల్ అయిన విమానం కాబట్టి చివరి విమానాన్ని అనుమతించింది.

అలా అనుమతించటమే మన కొంప ముంచినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే సోమవారం రాత్రి వచ్చిన చివరి విమానంలో దిగిన 266 మంది ప్రయాణీకుల్లో 25 మందికి కరోనా వైరస్ ఉందని వైద్యులు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన విమాన ప్రయాణీకులందరినీ ప్రత్యేకంగా విమానాశ్రయంలోనే పరీక్షించారు. వారిలో 25 మందికి కరోనా ఉందని గుర్తించటమే కాకుండా స్ట్రెయిన్ కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో కేంద్రప్రభుత్వంలో టెన్షన్ మొదలైపోయింది.

అనుమానిత స్ట్రెయిన్ కరోనా సోకినట్లు గుర్తించిన 25 మంది డిల్లీ, కోలకత్తా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించింది. దాంతో కేంద్రప్రభుత్వం వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. పై రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో దిగిన వారిని వెంటనే ప్రత్యేకమైన ఐసొలేషన్ వార్డుల్లో ఉండాలని ఆదేశించింది. మొత్తానికి బ్రిటన్ అల్లాడించేస్తున్న స్ట్రెయిన కరోనా మనదేశంలోకి కూడా వచ్చేసిందేమో అని టెన్షన్ మొదలైపోయింది. వీళ్ళ నుండి సేకరించిన బ్లడ్ శాంపుల్సును పూణేలోని నేషనల్ ల్యాబరేటరీకి పరీక్షల నిమ్మితం పంపింది. ఈ రిజల్టు వస్తే కానీ టెన్షన్ తగ్గేట్లు లేదు.