రాష్ట్రంలోనే కాదు.. ఒకరకంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రికార్డు సృష్టించారనే చెప్పాలి. గత 20 మాసాల కాలంలో తన శాఖలకు సంబంధించి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ పుస్తకాలను ప్రచురించారు. అయితే.. సహజంగానే కొన్ని ప్రభుత్వాలు ఇలా తమ అభివృద్ధిపై పుస్తకాలు వేయడం తెలిసిందే. కానీ, తొలిసారి.. ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా నియోజకవర్గాల వారీగా చేపట్టిన పనులపై పుస్తకాలు ముద్రించారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ చేతిలో అటవీ శాఖ, పంచాయతీరాజ్, శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నాయి. వీటిలో అత్యంత కీలకంగా భావిస్తున్న పంచాయతీ రాజ్, అటవీ శాఖలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి వచ్చే సాస్కీ నిధులు సహా ఆర్థిక సంఘాలు కేటాయించే మొత్తాలను నేరుగా తరలిస్తున్నారు. వాటితో అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. అలాగే అటవీ సంపదను పెంచుతున్నారు.
ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేస్తున్నారు. అయితే.. దీనిని కామన్గా చూడకుండా.. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆయా గ్రామాల్లోనూ.. మండలాల్లోనూ ఎంత మొత్తం నిధులు కేటాయించారు..? ఎలాంటి పనులు నిర్వహిస్తున్నారు..? ఇప్పటి వరకు గత 20 మాసాల్లో చేపట్టిన పనులు ఎన్ని? తద్వారా ప్రజలకు ఒనగూరిన లబ్ధి ఎంత? ఎన్ని రోడ్లు వేశారు.. ? ఎన్ని చెట్లునాటారు? ఇలా.. అనేక విషయాలతో పవన్ కల్యాణ్.. ఈ పుస్తకాలను ముద్రించారు. ఒక్కొక్క పుస్తకంలోనూ సుమారు 30-55 పేజీల వరకు ఉన్నాయి. అంతేకాదు.. ఒక్కొక్క నియోజకవర్గం పేరుతోనూ ఈ పుస్తకాలు ముద్రించి.. ఆయా ఎమ్మెల్యేలకు అందించారు.
ఇలా ఎందుకు?
నిజానికి నియోజకవర్గాల వారీగా పుస్తకాలు వేయడం.. పంపిణీ చేయడం ఇదే తొలిసారి. తద్వారా.. భారీ లక్ష్యాన్నే పవన్ కల్యాణ్ నిర్దేశించుకున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులు, అభివృద్ధికి సంబంధించి సందర్భం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఏదో చేస్తున్నామని చెప్పడం కాకుండా.. గణాంకాలతో సహా.. ఆయా పనులను వివరించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా.. ప్రజల్లో మరింత విశ్వాసాన్ని, కూటమి సర్కారు పట్లనమ్మకాన్ని పెంచేందుకు చాన్స్ ఉంటుందని పవన్ భావిస్తున్నారు. ఏదేమైనా.. దీనిని కూడా ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకు తీసుకువెళ్లాల్సిఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates