`చిరంజీవి` ఎఫెక్ట్‌… అక్క‌డి పాలిటిక్స్ మార‌తాయా ..!

చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆముదాల‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఈయ‌న గురించిన టాపిక్ పెద్ద‌గానే సాగుతోంది. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో బాగానే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయ‌కుల‌తోనూ క‌లివిడిగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిరంజీవి పోటీ చేయ‌డం ఖాయ‌మైంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. వైసీపీ ప‌రంగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. వాస్తవానికి 2024లోనే సీతారాం.. త‌న త‌న‌యుడికి టికెట్ ఇప్పించుకునేందుకు  ప్ర‌య‌త్నించారు. కానీ, పోటీ తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆ మేర‌కు అవ‌కాశం ఇవ్వలేదు. కానీ.. ఆ ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భావంతో వైసీపీ 11కు ప‌రిమితం అయింది.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌న కుమారుడిని నిల‌బెట్టాల‌న్న‌ది సీతారాం ఆలోచ‌నేకాదు.. నిర్ణ‌యం కూడా. దీంతో వైసీపీ అధినేత‌ను తాను ఒప్పించుకుంటాన‌ని గ‌తంలోనే చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇంటిప‌ట్టునే ఉంటూ.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో కుమారుడి పాత్ర‌ను మ‌రింత పెంచుతున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చిరంజీవే నిర్వ‌హిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య శాల‌ల‌ను నిర్మించే విష‌యంపై జ‌రిగిన నిర‌సనలోనూ ఆయ‌న పాల్గొన్నారు.

పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల్లోనూ చిరంజీవి పాల్గొంటున్నారు. దీనికితోడు యువ‌త‌ను ఎక్కువ‌గా ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ.. చిత్రం ఏంటంటే.. త‌న‌కు వ‌రస‌కు బంధువ‌య్యే.. ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌పై మాత్రం.. చిరంజీవిపై కూన ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు.

అంతా సైలెంట్‌గా సాగిపోతోంది. కొన్నాళ్ల కింద‌ట వివాదంగామారిన కూన ఆడియో టేపు వ్య‌వ‌హారం వెనుక చిరు ఉన్నార‌న్నది కూన వ‌ర్గం చెబుతున్న మాట‌. అంత‌కుమించి.. ఇరువురు కూడా బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకోవడం లేదు. కానీ, సైలెంట్‌గా చిరు పుంజుకుంటున్నారు. మ‌రి ఆయ‌న స‌క్సెస్ అవుతారా?  లేదా? అనేది చూడాలి.