వైసీపీ నేత‌ల‌ను గుర్తుచేసిన `పొంగులేటి`

ponguleti srinivas reddy
ponguleti srinivas reddy

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌వైపు త‌మ ఇళ్లు కోల్పోయిన బాధితులు అలో ల‌క్ష్మ‌ణా అంటూ.. క‌న్నీరు పెడుతున్నారు. వీరి విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకుని.. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీనిని వ‌దిలేసి.. వారిపై `పెయిడ్ ఆర్టిస్టులు` అనే ముద్ర వేయ‌డం గ‌మ‌నార్హం. “వారంతా పెయిడ్ ఆర్టిస్టులు“ అని పొంగులేటి ముక్తాయించారు.

ఈ త‌ర‌హా పరిస్థితి.. గ‌తంలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల్లో క‌నిపించింది. అప్ప‌ట్లో రైతులు రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ కోసం.. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేకంగా గ‌ళం విప్పారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. అయితే.. నాడు రైతులు చేసిన ఉద్య‌మాల‌ను. వారు చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌ను కూడా.. వైసీపీ నాయ‌కులు ఎద్దేవా చేశారు. “వారంతా పెయి డ్ ఆర్టిస్టులు“ అంటూ.. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్‌.. పొంగులేటి కూడా అవే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మంత్రి పొంగులేటి సొంత జిల్లా ఖ‌మ్మంలోని 62 ఎకరాల ప్రైవేట్‌ భూమిని భూదాన్‌ ట్రస్ట్‌కు గ‌తంలో కొంద‌రు విరాళంగా ఇచ్చారు. 2014లో ఈ ట్రస్ట్‌ బోర్డు నుంచి కొంత భూమిని సుమారు 2 వేల మందికి రెండు సెంట్ల చొప్పున భూములు ఇచ్చారు. దీంతో ఇక్క‌డి వారు ఇళ్లు కూడా క‌ట్టుకున్నారు. కానీ, తాజాగా ఆ ఇళ్ల‌కు ప‌ట్టాలు లేవ‌ని.. ఇంటి నిర్మాణానికి అనుమ‌తులు కూడా లేవ‌ని పేర్కొంటూ.. కూల‌గొట్టారు.

ఈ వ్య‌వ‌హారం.. తీవ్ర వివాదానికి దారితీసింది. బాధిత కుటుంబాల వారు.. రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. వీరికి బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ నేప‌థ్యంలో మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌లో స్పందిస్తూ.. వారంతా పెయిడ్ ఆర్టిస్టుల‌ని.. వారికి భూములు ఎవరు ఇచ్చారో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు. “కొంత మంది పెయిడ్ ఆర్టిస్టుల‌ను వెనుకేసుకుని.. రాజ‌కీయం చేస్తున్న వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు“ అంటూ.. పొంగులేటి అన్నారు. కానీ, ఆయ‌న త‌న సొంత జిల్లాకు చెందిన పేద‌ల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.