రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా కొడితే?” అంటూ సునీల్ కుమార్ చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “అబద్ధాలు బయటపడుతున్నాయి… నిజం దాగదు” అని వ్యాఖ్యానిస్తూ ఆయన పరోక్షంగా ఉంది ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో .. విచారణ జరుగుతోంది. ఆయన సైలెంట్‌గా ఉన్నారు కాబట్టి నేను కూడా సైలెంట్‌గా ఉండటం మంచిపద్ధతి అని పేర్కొన్న సునీల్ కుమార్, ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు మౌనం పాటిస్తానన్న వ్యక్తి, అకస్మాత్తుగా స్వరాన్ని మార్చుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక సునీల్ నాయక్ అరెస్టు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నుంచే సునీల్ కుమార్ మళ్లీ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇది రాజకీయ వ్యూహమా? లేక తాజా పరిణామాల ప్రభావమా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఏది ఏమైనా ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఒక ప్రమాదం జరిగితే దాన్ని ఉపయోగించుకొని ఆరోపణలు చెయ్యడం సబబు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న ఆభియోగాలపై సునీల్‌కుమార్‌ను ప్రభుత్వం తొలుత 2025 మార్చి 2న సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచీ ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అగ్రిగోల్డ్‌ నిధుల దుర్వినియోగంతో పాటు అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసుల్లో సునీల్‌ కుమార్‌పై విచారణ కొనసాగుతోంది.