ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు… `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే చెప్పాలి. బీసీల‌కు సంబంధించిన రిజ‌ర్వేష‌న్ అంశం.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. బీసీల జ‌నాభానే ఎక్కువ‌గా ఉంది. దీంతో వారికి ఉద్యోగ‌, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో మేలు చేసేలా.. గ‌త 2014-19 మ‌ధ్య టీడీపీ ప్ర‌భుత్వం 34 శాతం రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేసింది.

అయితే.. త‌మ‌కు ఇది చాల‌ద‌ని.. 50 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాలని బీసీలు ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్రమంలోనే వారికి 43 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తున్న‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అయితే.. దీనిని వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. తిరిగి 33 శాతానికి ప‌రిమితం చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా.. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. ఎవ‌రికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించినా.. మొత్తం 50 శాతానికి మించ‌రాద‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలోనే వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని.. ఎస్సీ, ఎస్టీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌యత్నంలో బీసీల‌కు అద‌నంగా క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్‌ను ఎత్తేసింది. అప్ప‌టి నుంచి బీసీలు ఆగ్ర‌హంతోనే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఓట‌మికి బీసీలు కూడా కార‌ణం కావ‌డానికి ఇదొక అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తిరిగి బీసీల‌కు మేలు చేయాల‌ని సంక‌ల్పంగా చెప్పుకొన్న చంద్ర‌బాబు.. మ‌రోసారి వారికి అద‌నంగా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే సింగిల్ మ్యాన్(ఏక స‌భ్య‌)క‌మిటీని కూడా నియ‌మించారు. ఈ క‌మిటీ ప్ర‌స్తుతం జిల్లాల్లో ప‌ర్య‌టిస్తోంది. ఉగాది(మార్చి 19) నాటికి ఈ క‌మిటీ రిపోర్టును ప్ర‌భుత్వానికి అందించ‌నుంది. అనంత‌రం.. ఈ క‌మిటీ సిఫార‌సుల మేర‌కు ప్రభుత్వం బీసీల‌కు 35-40 శాతం మ‌ధ్య‌(క‌మిటీ సిఫార‌సుల మేర‌కు) అమలు చేయాల‌ని నిర్ణ‌యించింది.

బీసీల‌కు న్యాయం చేయాల‌న్న ల‌క్ష్యంతోనే కూట‌మి స‌ర్కారు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయంగా ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా కూడా.. దీనిని సిద్ధం చేస్తున్నారు. తద్వారా.. బీసీల‌కు మేలు చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.