వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అప్పట్లో అధికార పార్టీలో ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా అభియోగ పత్రం దాఖలు చేశారని కోర్టు గమనించింది. తప్పు చేసిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని, డీజీపీ, ఎస్పీలు ఏమి చేస్తున్నారని నిలదీసింది.
నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబుకు ఉన్న డిఫాల్ట్ బెయిల్ను పొడగిస్తూ, ట్రయల్ను 2026 నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు సూచించింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ట్రయల్ కొనసాగాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు జారీ చేసిన ముఖ్య ఆదేశాల ప్రకారం — విచారణను సీనియర్ న్యాయాధికారికి అప్పగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించింది. అవసరమైన తదుపరి దర్యాప్తును 2026 మార్చి 31లోగా పూర్తి చేయాలి. అభియోగాల రూపకల్పనను 2026 ఏప్రిల్ 18లోగా నిర్ణయించి, అనంతరం సాక్ష్యాల పరిశీలన పూర్తి చేయాలి.
ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని ఇతర బాధ్యతల నుంచి విముక్తి కల్పించి ఈ కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలని, విచారణ నిలిపివేయడానికి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై కూడా అభియోగ పత్రం దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates