ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. చిన్న‌నాటి నుంచే విద్యార్థుల్లో రాజ‌కీయ అంశాల‌పై అవగాహ‌న క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఎమ్మెల్యేలు, మంత్రుల‌లో ఒత్తిడి తగ్గించేందుకు ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు క్రీడ‌ల పోటీలు కూడా నిర్వ‌హించ‌నున్నారు.

తాజాగా.. చేనేత‌ల‌కు అండ‌గా ఉండేలా.. అసెంబ్లీలో చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆప్కో ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నేత కార్మికులు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో చేనేత వ‌స్త్రాల‌తో కూడిన స్టాళ్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని  స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. స‌భ జ‌రిగిన‌న్ని రోజులూ.. ఈ స్టాళ్లు తెరిచి ఉంటాయ‌ని.. అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిబ్బంది స‌హా మీడియా.. వ‌ర‌కు అంద‌రూ ఇక్క‌డ వ‌స్త్రాల‌ను కొనుగోలు చేయొచ్చ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఈ స్టాళ్లను స్పీక‌ర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందించారు. స్వయంగా పట్టుచీరలు, పట్టు పంచె స‌హా ప‌లు చొక్కాల‌ను స్పీక‌ర్  కొనుగోలు చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.

అసెంబ్లీలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40 శాతం వరకు రాయితీ ఇస్తార‌ని స్పీక‌ర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్స‌హించాల‌ని.. త‌ద్వారా నేత కార్మికుల‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌లువురు మంత్రులు సైతం వ‌స్త్రాలుకొనుగోలు చేశారు. కాగా.. అసెంబ్లీ వంటి రాజ్యాంగ బద్ధ‌మైన వేదిక‌ల వ‌ద్ద‌.. చేనేత వ‌స్త్రాల స్టాళ్ల‌ను ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.