ఎమ్మెల్యేల‌తో `ఆట‌లు`: ముహూర్తం ఫిక్స్

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలలో  కేవ‌లం చ‌ర్చ‌లు, ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల‌కు క్రీడ‌లు పోటీలు నిర్వ‌హించాల‌ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు నిర్ణ‌యించారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వ‌మే ఈ సారి ఈ క్రీడ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 24, 25, 26 తేదీల్లో శాసనసభ్యులకు, మండ‌లి స‌భ్యుల‌కు కూడా క్రీడా పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. గెలిచిన వారికి  ట్రోఫీలు, కానుక‌లు కూడా అందించనున్నారు.

ఈ క్రీడ‌ల‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతరం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని క‌లిగించ‌డ‌మే ఈ క్రీడ‌ల వెనుక ఉద్దేశంగా ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర‌ క్రీడ‌ల‌ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో దీనిపై చ‌ర్చించిన ఆయ‌న ఏర్పాట్లు ఘ‌నంగా ఉండేలా చూడాల‌ని కోరారు.

ప్రధానంగా ఎవ‌రెవ‌రికి ఏయే ఆట‌ల‌పై మ‌క్కువ ఉందో.. తెలుసుకుని ఆ మేర‌కు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. క్రీడల ఎంపిక, విజేతలకు అందించే ట్రోఫీలు, వారికి అందించే జెర్సీలపైనా స్పీక‌ర్ చర్చించారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వ‌హించాల‌ని సూచించారు.

గ‌త ఏడాది ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వాడ వేదిక‌గా.. ఏ-క‌న్వెన్ష‌న్ లో నిర్వ‌హించారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సారి.. స్పాన్స‌ర్ల సాయంతో మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణ‌యించారు.  

మంత్రులు, ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల‌కు నిర్వ‌హించే పోటీలు ఇవీ..

1) పరుగు పందెం
2) వాలీబాల్
3) కబడ్డీ
4) టేబుల్ టెన్నిస్
5) చెస్
6) క్రికెట్
7) టెన్నికాయిట్
8) త్రో బాల్
9) టగ్ ఆఫ్ వార్
10) షటిల్ బ్యాడ్మింటన్
11) షాట్ పుట్
12) క్యారమ్స్
13) మ్యూజికల్ చైర్స్(మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు)
14) పికిల్ బాల్.