బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి. అస‌లే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌నీసం రెండు ప‌దుల సంఖ్య‌లో  కూడా స్థానాలు ద‌క్కించుకోలేద‌న్న ఆవేద‌న‌లో బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో మంచిర్యాల జిల్లాలోని క్యాత‌న‌ప‌ల్లి మునిసిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా తమ విధుల‌కు అడ్డు ప‌డ్డార‌ని.. త‌మ వారిపై దౌర్జ‌న్యం చేశార‌ని.. పోలీసులు బాల్క సుమ‌న్‌పై ఫిర్యాదు న‌మోదు చేసి.. తాజాగా అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈ ఘ‌ట‌న‌తో బీఆర్ఎస్ నాయ‌కులు మ‌రింత ఆవేద‌న, ఆందోళ‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని.. వ్యాఖ్యానించిన మాజీ మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని, పోలీసుల‌ను కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. సుమ‌న్‌ను అన్యాయంగా అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న పోలీసుల‌ను కూడా వ‌దిలిపెట్టేది లేద‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని కుట్ర‌పూరితంగా.. అడ్డదారుల్లో కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు ఒక్క‌రికే శాశ్వ‌తంగా ప‌ట్ట‌క‌ట్ట‌బోర‌న్న కేటీఆర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము విజ‌యం సాధించి తీరుతామ‌ని వ్యాఖ్యానించారు. అప్పుడు ఇంత‌కు ఇంత వ‌డ్డీతో స‌హా తీర్చుకుం టామ‌ని హెచ్చ‌రించారు.

కాన్వాయ్‌ను అడ్డుకున్నారా?

క్యాత‌న‌ప‌ల్లి ఘ‌ట‌న‌పై రెండు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ కాంగ్రెస్‌కు మెజార‌టీ వ‌చ్చింద‌ని ఆ పార్టీ స‌భ్యులు చెబుతున్నారు. కాదు.. బీఆర్ ఎస్‌కు మాత్ర‌మే స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చింద‌ని.. ఎక్స్ అఫిషియో స‌భ్యుడి పేరుతో ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ కుట్ర‌లు చేసింద‌ని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది.

మ‌రోవైపు.. బాల్క సుమన్‌.. త‌మ‌పై దాడి చేశార‌ని పోలీసులు చెబుతుండ‌గా.. అధికార పార్టీ మాత్రం.. త‌మ మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బాల్క దాడి చేశార‌ని అందుకే.. పోలీసులు అరెస్టు చేశార‌ని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం తీవ్ర గంద‌ర‌గోళానికి దారి తీసింది. మ‌రోవైపు బీఆర్ ఎస్ క్యాత‌న‌ప‌ల్లి బంద్‌కు పిలుపునిచ్చింది.14 రోజుల రిమాండ్‌..

పోలీసుల విధుల‌ను అడ్డుకున్నార‌న్న కేసులో బాల్క సుమన్ స‌హా.. న‌లుగురికి మంచిర్యాల కోర్టు 14 రోజు ల రిమాండ్ విధించింది. క్యాత‌న‌ప‌ల్లి మునిసిపాలిటీ చైర్మ‌న్‌ ఎన్నిక సంద‌ర్భంగా జ‌రిగిన వివాదంలో పోలీసుల‌పై దౌర్జ‌న్యం చేశార‌ని.. స్థానిక శ్రీరాంపురం పోలీసు స్టేష‌న్‌లో వీరిపై కేసు న‌మోదైంది.