మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ విధానాల గురించి తెలుసుకున్నారు బిల్ గేట్స్.
అయతే, కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయాలే కాకుండా వ్యవసాయ విషయాలను కూడా తెలుసుకున్నారు.. ఈ క్రమంలోనే ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిల్ గేట్స్ పర్యటించారు. అక్కడి అరటి తోటను పరిశీలించి అమరావతి రైతులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా గేట్స్ కు అమరావతి మహిళా ఒకరు స్థానిక వంటకాలను రుచి చూపించారు. ఆ మహిళ ఇచ్చిన విజయవాడ పునుగులను బిల్ గేట్స్ తిన్నారు. పునుగులు బాగున్నాయని గేట్స్ అన్నారు.
వ్యవసాయంలో డ్రోన్ల వినయోగం గురించి రైతులను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. ఇక, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని గేట్స్ కు చంద్రబాబు తెలిపారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇక, అమరావతి రాజధాని నిర్మాణం గురించి కూడా చంద్రబాబును గేట్స్ అడిగి తెలుసుకున్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సదుపాయాలతో సువిశాల రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని…గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ కితాబిచ్చారు. బిల్ గేట్స్ పునుగులు రుచి చూస్తూ పొలాల్లో పర్యటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates