ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉదారతతో పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారులకు కొండంత అండగా నిలిచారు. రాజకీయ ప్రచారాలకు అతీతంగా, మానవీయ దృక్పథంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
మొదట 42 మంది అనాథ చిన్నారులకు సహాయం అందించిన ఆయన, ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యను వెల్లడించిన మాధవపురానికి చెందిన సత్య, చైతన్య అనే ఇద్దరు చిన్నారులకు కూడా తక్షణ సాయం ప్రకటించారు. దీంతో మొత్తం 48 మంది చిన్నారులు ఆయన ఆర్థిక పరిరక్షణలోకి వచ్చారు.
ప్రతి చిన్నారికి నెలకు రూ. 5,000 చొప్పున తన సొంత జీతం నుంచి నేరుగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. తన పదవీకాలం ముగిసే వరకు ఈ సాయం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ కాగా, అల్లు అర్జున్ మేనేజర్ ఒకరు స్పందిస్తూ తనకు తెలిసిన ఒక విషయాన్ని పంచుకున్నారు.
ఒకసారి కాకినాడలో ప్రయాణిస్తుండగా తనకు పిఠాపురం ప్రాంతానికి చెందిన ఓ డ్రైవర్ కలిశాడని.. తన కుమార్తె 50 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఎందరికో తెలియజేసినా ఉపయోగం కలగలేదని ఆ డ్రైవర్ చెప్పాడట. ఒకసారి పవన్ కాన్వాయ్ ను ఆపి ఆయనకు తెలియజేయగా, ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ కు పంపించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారనీ.. వైద్య ఖర్చులతో పాటు ఆ కుటుంబానికి తన వ్యక్తిగత నిధుల నుంచి నెలకు రూ.12,000 సాయం అందిస్తున్నారని తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు, జనసైనికులు పవన్ తో పాటు ఈ విషయం పంచుకున్న బన్నీ మేనేజర్ అయిన శరత్ చంద్రను కూడా అభినందించారు.
కొంత కాలం నుండి పవన్ – బన్నీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో పవన్ చేసిన గొప్ప సాయం గురించి బన్నీ మేనేజర్ చెప్పడం పవన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ గొడవలన్నీ అభిమానులు మొదలుపెట్టుకున్నవేని.. వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారంటున్నారు విశ్లేషకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates