జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై మండిపడ్డారు.

అయితే, అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం…రెండు మాటలన్నారు అని వెనకేసుకురావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా అంబటి ఇష్యూ, జగన్ కామెంట్స్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక మహిళ గురించి మాట్లాడితే తాము ఎమోషనల్ అవుతామని, ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి తల్లి గురించి మాట్లాడినా వారిని కూడా వదిలిపెట్టబోమని లోకేశ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

అంబటి రాంబాబు రెండు చిన్న మాటలు అన్నారని మాజీ సీఎం జగన్ చెప్పారని, ఒకరి తల్లిని అవమానించడం చిన్న మాటా అని లోకేశ్ ప్రశ్నించారు. అటువంటి అంబటి రాంబాబును వైసీపీ నేతలు సమర్థించడం సరికాదని హితవు పలికారు. అంబటి రాంబాబుపై తాము కక్ష సాధిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు.

అంబటి క్షమాపణలు అడిగితే…సరిపోతుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఎవరి తల్లయిన.. .చెల్లయినా….అక్కయినా…రాష్ట్రంలో మహిళల జోలికి వెళితే.. ఈ ప్రజా ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. మహిళల భద్రతకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. ముందు ముందు కూడా చూస్తారని హెచ్చరించారు.

మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు వైసీపీ నేతలకు లేదని, కానీ, ఆ అలవాటు తమకుందని చురకలంటించారు. అది తమ సంస్కృతి అని అన్నారు. వైఎస్ భారతి రెడ్డి గారి గురించి టీడీపీ కార్యకర్త మాట్లాడితే తాము చర్యలు తీసుకున్నామని, అతడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని గుర్తు చేశారు.