తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ముఖ్యంగా ఏపీ సరిహద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర మునిసిపాలిటీలో ముగ్గురు మహిళా అభ్యర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీచేశారు. వీరిలో మధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘనవిజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించడంతో ఆమె అనుచరులు, మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.
ఎలా సాధ్యమైంది?
ఖమ్మం జిల్లాలో టీడీపీ అభిమానులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 2014లోనూ పలువురు అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలోనూ టీడీపీ విజయం దక్కించుకుంది. ఇలా.. తన పట్టును కొనసాగిస్తున్న సైకిల్ పార్టీ ఈ దఫా ప్రత్యక్షంగా మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. అయితే.. కొందరు స్వయంగా టీడీపీ తరఫున బరిలో నిలిచారు. మునిసిపల్ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు టీడీపీ గుర్తుపైనే పోటీచేశారు.
వీరిలో రేవతి.. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తుది దశ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి 334 ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. ఆమెపై పోటీ చేసిన అభ్యర్థి పెదపూడి సుధాకర్ 168 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దీంతో 166 ఓట్ల తేడాతో రేవతి విజయం దక్కించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇక, రేవతి విజయం వెనుక స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా ప్రచారం చేయడంతోపాటు.. ఎన్టీఆర్, చంద్రబాబుల సెంటిమెంటు కూడా కలిసి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates