దువ్వాడతో జగన్ ఏం చెప్పారు?

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి పరిచయమున్నారో లేరో తెలీదుగానీ…దువ్వాడ శ్రీనివాస్, మాధురిల జంట అంటే మాత్రం ఆ పేరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. మాధురి పుణ్యమా అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు. మాధురితో రిలేషన్షిప్, భార్యతో ఆస్తి తగాదాలు, ధర్మానతో అంతర్గత విభేదాలు…వెరసి దువ్వాడను 7 నెలల క్రితం వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు జగన్.

అయినా సరే, శాసన మండలి సమావేశాల సమయంలో అసెంబ్లీకి దువ్వాడ శ్రీనివాస్ వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన దువ్వాడను జగన్ పలకరించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వస్తున్న జగన్‌ను దువ్వాడ కలిశారు. ఈ సందర్భంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అని దువ్వాడను జగన్ ఫ్రెండ్లీగా పలకరించారట. ధర్మానతో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడాలని జగన్ ను దువ్వాడ రిక్వెస్ట్ చేశారట. అయితే, ఆ మ్యాటర్ పై డిస్కస్ చేసేందుకు తాడేపల్లి రావాలని దువ్వాడకు జగన్ చెప్పారట.

ఈ క్రమంలోనే త్వరలోనే జగన్‌ను కలుస్తానని, వైసీపీలో ఛాన్స్ ఇవ్వకుంటే సొంతంగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని మీడియాతో దువ్వాడ అన్నారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తానని, తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని చెప్పారు. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.