బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడి కొన్ని సందర్భాల్లో ఆయన చిక్కుల్లో పడుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా తమ మిత్రపక్షమైన టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
గతంలో ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉందని అనుకునేవారని, ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఈ రోజు స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా చేసినవని మాధవ్ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు.
అయినా సరే, ఆ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటానని చెప్పారు. అయితే, మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అది బీజేపీ సమావేశం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
అప్పుడే ఆదినారాయణ రెడ్డి కామెంట్లను వేదికపై నుంచి మాధవ్ ఖండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెెబుతున్నారు. వివరణ కాదు…ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లేదంటే టీడీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కూటమి సమైక్యతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates