పిల్ల‌లు పోస్టు పెట్టారు.. ప‌వ‌న్ ప‌నిచేశారు!

సోష‌ల్ మీడియాలో లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్న విష‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో గిరిజ‌నుల స‌మ‌స్య‌లు.. త‌ర్వాత ఎస్సీల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న వెనువెంట‌నే ప‌రిష్క‌రించారు.

ఎవ‌రో వ‌చ్చి.. త‌న ముందు నిల‌బ‌డి త‌మ సమ‌స్య‌లు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా.. సామూహిక స‌మ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. వాటిని ప‌రిష్క‌రిస్తున్నారు. ఇక‌, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై మాత్రం పార్టీ కార్యాల‌యంలో విన‌తులు తీసుకుంటున్నారు.

పిల్ల‌లే క‌దా.. అని!

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి స్థాయిని బ‌ట్టి అధికారులు, నాయ‌కులు స్పందిస్తారు. చిన్న పిల్ల‌లు పెట్టే పోస్టుల‌కు పెద్ద‌గా ఎలాంటి స్పంద‌నా ఉండ‌దు. అలాంటిది తొలిసారి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్నారులే అయినా..వారు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌పై చ‌లించిపోయారు.

మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని వారికి హామీ ఇవ్వ‌డ‌మే కాదు.. కొన్ని ద‌శాబ్దాలుగా వెంటాడుతున్న స‌ద‌రు స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ ప‌రిష్కారం కూడా చూపించారు. ఆ వెంట‌నే అధికారుల‌తో హుటాహుటిన స‌ద‌రు స‌మ‌స్య ప‌రిష్కారానికి అయ్యే వ్య‌యంపై అంచ‌నాలు తెప్పించుకుని ఆ నిధుల‌కు కూడా అనుమ‌తులు ఇచ్చేశారు.

ఏంటా స‌మ‌స్య‌.. ?

నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చల్లగిరిగెల గ్రామంలో ప్ర‌భుత్వ స్కూలుకు వెళ్లేందుకు ఒకే ఒక దారి ఉంది. ఈ దారి గుండా 3 కిలో మీట‌ర్లు ప్ర‌యాణించి..విద్యార్థులు స్కూలుకు చేరుతారు. అయితే.. ఈ దారి ధ్వంసం కావ‌డం.. పైగా మ‌ట్టి రాళ్లు తేలిపోయి.. మోకాల్లోతు గుంత‌లు ప‌డ‌డంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది విద్యార్థులకు ప్ర‌త్యేకంగా ఒక ఆటోను ఏర్పాటు చేశారు. సుమారు 22 మంది విద్యార్థులు రెండు ట్రిప్పుల్లో స్కూల్‌కు వెళ్తున్నారు.

అయితే.. తాజాగా కొన్నాళ్ల నుంచి రోడ్డు పూర్తిగా ధ్వంసంకావ‌డంతో విద్యార్థులు న‌ర‌కం చూస్తున్నారు. స్థానిక అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో చిన్నారులు ఈ స‌మ‌స్య‌ను సోష‌ల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి వివ‌రించారు.

వెంట‌నే స్పందించిన ఉపముఖ్యమంత్రి చిన్నారుల స‌మ‌స్య పరిష్కారానికి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. దాదాపు 86 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కేటాయించి.. ర‌హ‌దారిని పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించారు. మొత్తంగా 3 కిలో మీట‌ర్ల దారి ఇప్పుడు ఏర్ప‌డ‌నుంది.