బూతులు మాట్లాడే నేతలపై బీజేపీ సీనియర్ మోస్టు నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీరియస్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్రజలు బలమైన సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇలాంటి రాజకీయాలలో ఉన్నామా? అని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. ఆయన ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ, ఇటీవల కాలంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లు చేసిన వ్యాఖ్యలు, దుర్భాలషలపై వెంకయ్య పరోక్షంగా ప్రస్తావించారు.
విశాఖలో పర్యటించిన వెంకయ్య శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాలు సహా తెలంగాణ రాజకీయాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
“సీనియర్ నేతలే కట్టు తప్పుతున్నారు“ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడడాన్ని కొందరు ఫ్యాషన్ గా భావిస్తున్నట్టు తెలిపారు. ఇది సరికాదన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పేపర్లు, మీడియాలో కనిపిస్తారని కొందరు భావిస్తున్నారని.. ఇది ఎంత మాత్రం సరికాదని చెప్పారు. ఇలాంటి వారిని మీడియా కూడా బహిష్కరించాలని సూచించారు.
సక్రమమైన రాజకీయాలు చేసిన వాజ్పేయి, అరుణ్జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటివారిని దేశం ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. నేటి తరం నాయకులు కూడా ఆ విధానాలను అలవరుచుకోవాలని సూచించారు.
ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటే.. రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఇదే లోపించిందన్నారు. దీంతో సక్రమంగా మాట్లాడలేని నాయకులు “తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే దుస్థితి వచ్చింది“ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం అయిందని తాను చెప్పడం లేదన్నారు.
అన్ని పార్టీల్లోనూ ఇదే జాడ్యం కొనసాగుతోందన్నారు. అనవసరంగా నోరు చేసుకునే వారికి .. ప్రజలు నిశ్శబ్దంగా ఎన్నికల పోలింగ్ సమయంలో బుద్ధి చెప్పాలని సూచించారు. తమ హయాంలో రాజకీయ నేతల నుంచి అనేక విషయాలు నేర్చుకునే పరిస్థితి ఉండేదన్న ఆయన.. ఇప్పుడున్న నేతల నుంచి బూతులు నేర్చుకునే పరిస్థితి భావి తరాలకు ఏర్పడిందని దుయ్యబట్టారు. ఈ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం నాయకులపై ఉందని, వారు మారకపోతే.. వారిని మార్చాల్సిన అవసరం ప్రజలపైనే ఉంటుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
