అమ‌రావ‌తి రైతుల‌పై మ‌రీ అన్యాయంగా..

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రాంతంలో రాజ‌ధాని క‌ట్టాల‌నుకుంది. అందుకోసం చ‌ట్టం కూడా చేసింది. రాజ‌ధాని కోసం రైతుల్ని భూముల‌డిగింది. వాళ్లు ఔన‌న్నా, కాద‌న్నా ఏం చేసైనా భూములు తీసుకోవ‌డం ఖాయం. ఐతే ప్ర‌భుత్వం లాభ‌దాయ ప్యాకేజీ అనేస‌రికి మెజారిటీ రైతులు స‌రే అన్నారు. ఇష్టం లేని రైతులు సైతం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో భూములు ఇచ్చారు. ఒప్పందాలు జ‌రిగాయి. కానీ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోయింది.

ఇంత‌కుముందు ఆ ప్రాంతంలో రాజ‌ధాని త‌మ‌కు పూర్తి ఆమోద యోగ్యం అన్న ఆ పార్టీనే అధికారంలోకి వ‌చ్చాక మాట మార్చేసింది. రాజ‌ధానిని త‌ర‌లించ‌డానికి సిద్ధ‌మైపోయింది. దీనికి వ్య‌తిరేకంగా ఆ రైతులు పోరాడుతున్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై నిల‌దీస్తున్నారు. ఇదీ అమ‌రావ‌తి రైతుల దీన గాథ‌.

రాజ‌కీయ క్రీడ‌లో బ‌లిప‌శువులైన ఆ రైతులు.. ఏడాదిగా పోరాడుతుంటే ప్ర‌భుత్వం నుంచి వారి బాధ‌ను ఆల‌కించే నాథుడే లేడు. పైగా వారిని పెయిడ్ ఆర్టిస్టుల‌ని, దురాశాప‌రుల‌ని నానా మాట‌ల‌న్నారు. త‌మ పోరాటానికి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో మ‌రింత పెద్ద స్థాయికి ఉద్య‌మాన్ని తీసుకెళ్లాల‌ని ఆ రైతులు చూస్తుంటే.. వారి గురించి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లు మ‌రీ అన్యాయంగా అనిపిస్తున్నాయి. వ్యవసాయం వదులుకుని భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులు కాదని ఆయ‌న‌ విమర్శించారు. ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. ఎక్కడైనా రైతు సాగుకోసం పరితపిస్తాడని.. వీళ్లు మాత్రం తమకు భూములొద్దు ప్లాట్లు కావాలంటున్నారని ఆక్షేపించారు. ప్లాట్ల విలువ పెరగాలని కోరుకునేవారు రైతులెలా అవుతారని నాని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో నిరుపేద రైతులు, బలహీనవర్గాలకు సెంటు స్థలం ఇస్తామని ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. తమ పొలాలు తీసుకున్న ప్ర‌భుత్వం అక్క‌డ అనేక నిర్మాణాలు చేప‌ట్టి, రోడ్లేసి పొలాల రూపాల్నే మార్చేస్తే.. త‌మ పొలాలెక్క‌డున్నాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటే.. మంత్రి చెబుతున్న‌ట్లు రైతులు వ్య‌వ‌సాయం ఎలా చేయాలి? తాము ప్ర‌భుత్వానికి ఇచ్చిన పొలంలో నాలుగో వంతు మాత్ర‌మే వెన‌క్కి ఇచ్చిన‌పుడు అవి అభివృద్ధి చెందాల‌ని, వాటి రేటు పెర‌గాల‌ని ఆశించ‌డంలో ఏం త‌ప్పుంది? త‌మ సంగ‌తి తేల్చ‌కుండా త‌మ స్థ‌లాల్ని పేద‌ల‌కి రాసిస్తామంటే వారెలా ఒప్పుకుంటారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు నాని ఏం స‌మాధానాలు చెబుతారో మ‌రి?