ట్రస్టు భవన్ కు చేరిన విజయనగరం పంచాయితి

మొత్తానికి చిలికి చిలికి గానవానలాగ తయారైన విజయనగరం టీడీపీ పంచాయితి తాజాగా మంగళగరిలోని తెలుగుదేశంపార్టీ సెంట్రల్ ఆఫీసు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంది. జిల్లాలో మొదటినుండి అంటే దశాబ్దాల తరబడి అశోక్ గజపతిరాజుదే ఆధిపత్యం. జిల్లా అధ్యక్షుడిగా ఎవరున్నా, ఎంపి, ఎంఎల్ఏలు ఎంతమందున్నా అశోక్ చెప్పింది ఫైనల్. ఒకపుడు ఎన్టీయార్ అయినా తర్వాత చంద్రబాబునాయుడు అయినా విజయనగరం జిల్లా వ్యవహరాల్లో జోక్యం చేసుకునే వారుకాదు.

ఈ కారణంగా జిల్లాలో గొడవలు ముదిరి పాకానపడ్డాయి. ఎప్పుడైతే అశోక్ గజపతిరాజు చెప్పిందే వేదంగా జిల్లాలో నడుస్తోందో ఇంకో నేతెవరు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని ఎంపి సీటుతో పాటు మొత్తం తొమ్మిది అసెంబ్లీల్లోను తెలుగుదేశంపార్టీ చిత్తుగా ఓడిపోయింది. అశోక్ మీదున్న కోపంతోనే టీడీపీలోని చాలామంది వైసీపీకి సహకరించారనే టాక్ కూడా నడుస్తోంది. అశోక్ ఆధిపత్యం ఎంతలా ఉందంటే జిల్లాలో పార్టీ కార్యాలయం కూడా ప్రత్యేకంగా లేదు.

పార్టీ మీటింగులు పెట్టాలంటే అశోక్ బంగ్లాలోని తోటలోనే చెట్లక్రింద పెట్టుకోవాలట. పార్టీకి ప్రత్యేకంగా వేరే కార్యాలయం ఏర్పాటును కూడా రాజుగారు ఇన్ని సంవత్సరాలనుండి ఒప్పుకోలేదట. ఇటువంటి పరిస్ధితుల్లో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా రాజుగారు పార్టీ నేతల విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. దాంతో అశోక్ అంటే పడని చాలామంది సీనియర్లు విజయనగరం మాజీ ఎంఎల్ఏ మీసాల గీతను ముందుపెట్టి కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు.

ఈ విషయంలో అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదట. అందుకనే వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి రాజుగారు ఫిర్యాదు చేశారట. అయినా ఉపయోగం కనబడలేదు. దాంతో విషయం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని తన మద్దతుదారులను తీసుకుని అశోక్ ట్రస్టు భవన్ కు చేరుకున్నారు. విషయం తెలియటంతో గీత నేతృత్వంలోని ప్రత్యర్ధివర్గం కూడా ట్రస్టుభవన్ కు బయలుదేరిందట. మరి ఈ పంచాయితీని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే.