బాబును తిడితే మైలేజీ పెరుగుతుందా..!

సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం కోసం చంద్రబాబును దూషించిన చాలామంది నాయకులు ఫేడ్ అవుట్ అయ్యారు. ఇలాంటి వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రస్తుతం జైలు పాలైన అంబటి రాంబాబు కూడా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు.

ఈ ముగ్గురు గతంలో వైసిపి అధినేతగా ఉన్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన వారే. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ను తీవ్రస్థాయిలో దూషించిన వారే. నారా లోకేష్ ను విమర్శించిన వారి జాబితాలో చాలామంది ఉన్నారు. కానీ చంద్రబాబును ప్రత్యేకంగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందువరుసలో నిలిచారు. అసెంబ్లీ వేదికగానే వారు చంద్రబాబును దూషించారు. చంద్రబాబు సతీమణి, ఆయన కుటుంబంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఖర్జూర నాయుడు కిస్మిస్ నాయుడు అంటూ చంద్రబాబు తండ్రిపై ఆనాడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ యూట్యూబ్లో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అంబటి రాంబాబు చేసిన దుర్భాషలు కూడా తీవ్ర విమర్శలకు దారి తీశాయి. నిజానికి చంద్రబాబును తిట్టినందువల్ల ఎవరి గ్రాఫ్ పెరగలేదన్న విషయం గత ఎన్నికల్లోనే స్పష్టమైంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న పలువురు నేతలు ఓటమిపాలయ్యారు. వైసీపీకి గాలి లేకపోవడం ఒక కారణమైతే, చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు ప్రజల్లో ప్రతికూల భావన కలిగించాయన్న అభిప్రాయం వినిపించింది.

అందుకే ఐదు సార్లు విజయం సాధించిన కొడాలి నాని సైతం గత ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఇక ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే వైసిపి నాయకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం కంటే ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తేనే నాయకులకు ప్రాధాన్యం పెరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

ఈ దిశగా కొంతమంది వైసిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు నాయకులు చంద్రబాబును విమర్శించడం ద్వారా టిడిపిని రెచ్చగొట్టి లాభం పొందాలనే ప్రయత్నం చేయడం ఆ పార్టీకి మేలు చేయదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటువంటి పరిణామాలను ప్రజలు సహించరని అంటున్నారు. భవిష్యత్తులో అయినా విజయం సాధించాలంటే, ప్రజల మద్దతు పొందాలంటే చంద్రబాబు లేదా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి, గతంలో జరిగిన పొరపాట్ల సవరణ దిశగా అడుగులు వేయడం మంచిదని సూచిస్తున్నారు.