అంబ‌టికి జైలు… బాబును పెట్టిన చోటే!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను రాజ‌మండ్రిలోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌తంలో వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎక్క‌డైతే ఉంచారో.. అక్క‌డే ఇప్పుడు అంబ‌టి కూడా ఉండ‌నున్నారు.

ఈయ‌నే కాదు.. గ‌తంలో అక్ర‌మ మ‌ద్యం కేసులో అరెస్ట‌యిన ప్ర‌స్తుత రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా.. ఆ జైలులోనే 83 రోజుల‌పాటు ఉంచిన విష‌యం తెలిసిందే. ఇదంతా యాదృచ్ఛిక‌మే అయినా.. చేసిన పాపం ఎక్క‌డికి పోతుంద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర‌బాబును జైల్లో పెట్టి ఆనందించిన నాయ‌కుల‌కు అదే చోట జైలు ప‌డుతుండ‌డంపై వారు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇక‌, అంబ‌టి రాంబాబు చెప్పిన‌ట్టుగానే.. బెయిల్ కోర‌లేదు. వాస్త‌వానికి ఆయ‌న బెయిల్ పిటిష‌న్ వేసుకుని ఉంటే.. మ‌రోలా జ‌రిగి ఉండేద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. తొలుత న్యాయాధికారి.. ఆయ‌న‌ను గుంటూరు జైలుకే సిఫారసు చేశారు.

కానీ, రాంబాబే.. ప‌ట్టుబ‌ట్టి త‌న‌ను రాజ‌మండ్రి జైలుకు పంపించాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, విచార‌ణ‌లోనూ రాంబాబు పెద్ద‌గా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌లేదు. సీఎం చంద్ర‌బాబుపై దూష‌ణ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగా వైసీపీ నాయ‌కుల‌ను టీడీపీ టార్గెట్ చేస్తోంద‌ని.. దీంతో త‌మ ప‌రిస్థితి  ఇబ్బందిగా మారింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. చేసుకున్న వారికి చేసుకున్నంత‌.. అన్న‌ట్టుగా నోటి దురుసు మంచిది కాద‌ని.. గ‌త అనుభ‌వాలు వైసీపీకి గుణపాఠంగా మారినా.. నాయ‌కులు మార‌డం లేదు. మ‌రోవైపు మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను కూడా అరెస్టు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఆయ‌న‌పై తాజాగా రాష్ట్రంలో మ‌రో నాలుగు కేసులు న‌మోద‌య్యాయి.