ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ఆన్ కెమెరా విచారణ జరిపారు. అయితే, సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.
ఈ గదిలో కూర్చొని ఈ ఇంట్లో నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ రచన చేశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారట. ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ గదిలోనే ఈ తరహా ఆరోపణలపై విచారణ ఎదురుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారట.
ఇటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారట. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఎంతో మందితో చర్చలు జరిపానని గుర్తు చేసుకున్నారట. ఇక్కడ ఆ విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారట.
విచారణ నేపథ్యంలో నంది నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా, కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టగా…ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
నాలుగున్నర గంటల సుదీర్ఘ విచారణ తరువాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసాన్ని విడిచి వెళ్ళారు. ఐతే చట్టప్రకారం 65 సంవత్సరాల పైబడిన వారిని సాయంత్రం 6 గంటల తరువాత ప్రశ్నించడానికి వీల్లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై సిట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates