+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే.
+ దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను ఎవరు అరికట్టాలి? దీనికి సందేహం ఎందుకు.. కేంద్రమే!.
+ దేశాన్ని రక్షించేందుకు.. ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది..? దీనికి సమాధానం కూడా కేంద్రమే.
ఇలా.. దేశాన్ని, దేశ సరిహద్దులను రక్షించేందుకు కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుంది. ఉందికూడా. కానీ, ఈ విషయంలో ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. “మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి. సరిహద్దుల్లో (బంగ్లాదేశ్-భారత్) కంచెను నిర్మించి.. 45 రోజుల్లోనే పూర్తి చేసి.. చొరబాటు దారులను అడుగు కూడా పెట్టకుండా చేస్తాం“ అని వ్యాఖ్యానించారు.
మరి ఆయన ఏ ఆలోచనతో ఈ మాటలు అన్నారో తెలియదు కానీ.. దేశ భద్రత, సరిహద్దుల రక్షణను కూడా ఎన్నికలకు వినియోగించడం.. ఇదే తొలిసారి అని నిపుణులు, మాజీ సైనికులు కూడా మండి పడుతున్నారు.
ఏం జరిగింది..?
పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య ఎన్నికలు ఉన్నాయి. ఇవి బీజేపీకి.. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు కూడా కీలకంగామారాయి. 294 అసెంబ్లీ సీట్లున్నపెద్ద రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గత పార్లమెంటు ఎన్నికలకు ముందు.. అధికార టీఎంసీని చీల్చే ప్రయత్నం చేశారు. ఇక, గత ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ(ప్రస్తుత సీఎం)ని ఓడించారు. తర్వాత..ఆమె వేరే నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు.
అయితే.. త్వరలోనే జరగనున్న ఎన్నికలను టార్గెట్ చేసుకున్న బీజేపీ.. తాజాగా అప్రకటిత ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా శనివారం రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలో పర్యటించిన అమిత్ షా.. కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని.. తాము ఇక్కడ(రాష్ట్రం)అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే భారీ ఎత్తున కంచె ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లా లని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు.
ఎవరి బాధ్యత?
వాస్తవానికి.. దేశ సరిహద్దుల్లో కంచెలు నిర్మించే బాధ్యత కేంద్రానిదే. ఈ క్రమంలో భూములను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే.. ప్రత్యేక సైనిక చట్టాల ప్రకారం(దేశంలో ఉన్నాయి) సరిహద్దులను స్వాధీనం చేసుకుని రక్షణ గోడలు, కంచెలు ఏర్పాటు చేసే అవకాశం కేంద్రానికి ఉంటుంది. (గతంలో రాజౌరీ జిల్లాలో(కశ్మీర్) కేంద్రం ఇలానే చేసింది.) కానీ.. ఎన్నికల వరకు ఈవిషయాన్ని సాగదీసి.. ఇప్పుడు చొరబాట్లను అడ్డుకుంటామని.. కంచెను నిర్మిస్తామని ఎన్నికల రాజకీయాలు చేయడం పట్ల మాజీ సైనికులే కాదు.. రాజకీయ వర్గాలు కూడా దుయ్యబడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates