కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై వచ్చీ రాగానే జోగి రమేశ్ తన నోటికి పని చెప్పారు.
గతంలో కూడా పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను దుర్భాషలాడిన జోగి రమేశ్…తాజాగా మరోసారి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ కు ఒళ్లు తగ్గింది కదా కొవ్వు కూడా తగ్గిందనుకున్నానని, కానీ, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అని జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
వాడు వీడు అంటూ లోకేశ్ ను పరుష పదజాలంతో జోగి రమేశ్ విమర్శించిన వైనం వివాదాస్పదమైంది. ఇక, చంద్రబాబు, లోకేశ్ తప్పుడు మనుషులు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దేవుడిని, గుడిని అపవిత్రం చేయాలని చూసి ఏడాదిన్నరలోనే భ్రష్టు పట్టిపోయారని విమర్శించారు. కల్తీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అడుగుతున్నానని..లడ్డూ కల్తీ అన్నారని, కానీ, అది నిరూపితం కాలేదని అన్నారు.
ఇక, పరకామణి కేసు, తనపై పెట్టిన కల్తీ మద్యం కేసు కూడా అంతే అవుతాయని చెప్పారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరానని, నార్కో అనాలసిస్ కోరానని అయినా స్పందించలేదని అన్నారు. తిరుమల వెంకన్న గుడికి, చంద్రబాబు ఇంటికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పినా చంద్రబాబు, లోకేశ్ స్పందించలేదన్నారు. 84 రోజులు తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని, అయినా తన గొంతు నొక్కలేకపోయారని అన్నారు.
జగన్ ను సీఎం చేసేదాకా ఈ పోరాటం ఆగదని, కూటమి ప్రభుత్వం అంటేనే మోసాలు, కల్తీ అని తేలిపోయిందని, ఏడాదిన్నరలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. దావోస్ పర్యటన తర్వాత ఏపీకి పెట్టుబడుల వరద అన్నారని, ఎక్కడి నుంచి వరద వస్తోందని ప్రశ్నించారు. దావోస్ కు వెళ్లి డబ్బాలు కొడుతున్నారని….దవాఖానాలో ఆరోగ్య శ్రీ బిల్లులు రాక, మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates