ఆలయాలపై జగన్ కు సోము వీర్రాజు బహిరంగ సవాల్

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం నాడు రాజకీయ దుమారం రేపింది. దీంతో, వైసీపీ సర్కార్ పై కేంద్రం కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు సీఎం జగన్.

ఆ తర్వాత, తిరుపతిలో జగన్ డిక్లరేషన్ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాలు వైసీపీ సర్కార్ ను ఇరుకున పెట్టాయి. వైసీపీ సర్కార్ హిందువుల మనోభావాలను గౌరవించడం లేదని బీజేపీ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారాలు సద్దుమణిగాయనుకుంటున్న నేపథ్యంలో తాజాగా మరోసారి జగన్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు హిందూ సంప్రదాయాలపై గౌరవం, నమ్మకం లేవని సోము వీర్రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. విజయవాడలో చంద్రబాబు హయాంలో కూలగొట్టిన 27 ఆలయాలను నిర్మించాలని ప్రకాశం బ్యారేజి వద్ద బీజేపీ నేతలతో సోము ధర్నా చేశారు.

చర్చిలకు రూ. 24 కోట్లు, దర్గాలకు రూ. 5 కోట్లు కేటాయించిన జగన్ పై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని చర్చిల నిర్మాణానికి ఎలా ఇస్తారని సోము ప్రశ్నించారు. ఏపీలో దేవాదాయశాఖ తీరు ఆందోళనకరంగా ఉందన్న సోము వీర్రాజు…ఏపీలో శిథిలావస్థలో ఉన్న పలు ఆలయాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో ఆనాడు చంద్రబాబు అనేక ఆలయాలను పడగొట్టారని, వాటికి ఆయన కూడా సమాధానం చెప్పాలన్నారు.

ఆ ఆలయాలను పునర్నిర్మించాలని నాటి బీజేపీ నేత, నేటి దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారని సోము వీర్రాజు గుర్తు చేశారు. కానీ, ఇపుడు వెల్లంపల్లి… దర్గాలను కడతామని చెబుతున్నారని, దేవాలయాల భూములను ఇళ్ల స్థలాలకు, ఆలయాల నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను వెల్లంపల్లి నిర్వీర్యం చేస్తున్నారని, తన పదవికి వెల్లంపల్లి తక్షణమే రాజీనామా చేయాలని సోము డిమాండ్ చేశారు. ఏపీలోని చర్చిలకు వేల కోట్ల ఆదాయాలున్నాయని, జగన్ కు దమ్ముంటే చర్చిల డబ్బులను ఖర్చు చేయాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. జగన్ కు చర్చిలు, దర్గాలు మాత్రమే కావాలా? ఆలయాలు అవసరం లేదా? అని సోము ప్రశ్నించారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగసభకు బీజేపీ మద్దతిస్తోందని, బీజేపీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వెల్లడించారు.