పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు మొదలుకానున్నాయి. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. ఈ నెల 31న శనివారం సెలవు ఉండగా, ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్ (2026–27)ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా ఈసారి సుమారు 40 రోజులకుపైగా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు టీడీపీ–జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీల ఎంపీలకు అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, కేటాయింపులు, ప్రాజెక్టులు సహా అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంటులో గళం వినిపించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రాధాన్యాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.
అయితే దీనికి భిన్నంగా వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీపై జరుగుతున్న రాజకీయ విమర్శలు, పార్టీ కార్యకర్తలపై దాడులను పార్లమెంటు వేదికగా ప్రస్తావించాలని నాలుగు మంది లోక్సభ సభ్యులతో పాటు ఇతర రాజ్యసభ సభ్యులకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఎవరు ఏ అంశాన్ని మాట్లాడాలన్న దానిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్టు సమాచారం.
రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, అమరావతి అంశం, అప్పులు, శాంతి భద్రతలు వంటి విషయాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా వ్యవహరించాలన్న దిశగా వైసీపీ వ్యూహం సాగుతున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇది కొత్త విధానం కాదు. గతంలో కూడా వైసీపీ ఇదే తరహాలో తన బాధను పార్లమెంటులో వినిపించే ప్రయత్నం చేసింది. అయితే అప్పట్లో ఆ అంశాలకు పెద్దగా స్పందన రాలేదు. అయినా సరే, ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగించేందుకు పార్టీ సిద్ధమవడం గమనార్హం.
నిజానికి రాష్ట్రానికి ఏం కావాలి, ఏం రావాలి అనే విషయాలపై పార్టీభేదాలు లేకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు వ్యవహరిస్తున్నాయి. కానీ ఏపీ విషయంలో మాత్రం వైసీపీ వ్యవహార శైలి తన సమస్యలను జాతీయ వేదికపై రాజకీయంగా వినిపించడానికే పరిమితం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates