‘అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు’

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు ముందు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అమరావతికి మద్దతిచ్చిందని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా బిల్లులో అంశాలుండాలని డిమాండ్ చేశారు.

రైతులకు న్యాయం జరగలేదని, రామారావు అనే రైతు ఆవేదన చెందుతూ చనిపోయారని, వారి తరఫున పార్లమెంటులో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా అన్ని అంశాలు లేేవనెత్తాలని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా వైసీపీ ఎంపీలు పోరాడతారని తెలిపారు.

7 నెలలుగా జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం నిధులు పెండిగ్ లో ఉన్నాయని గత పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తిందని, ఆ తర్వాతే నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.