గెలుపు గుర్రాలు సైలెంట్‌.. ఓడినోళ్ల‌ దూకుడు.. ఏం బీజేపీ.. ఏం రాజ‌కీయం?

ప్ర‌జా క్షేత్రంలో ఒక‌సారైనా..గెలిచిన నాయ‌కులు బీజేపీలో చాలా మందే ఉన్నారు. కామినేని శ్రీనివాస‌రావు, కంభంపాటి హ‌రిబాబు, గోక‌రాజు గంగ‌రాజు.. ఇలా అనేక మంది ఉన్నారు. ఇక‌, ఎన్నో సార్లు.. కమ‌లం త‌ర‌ఫున బ‌రిలోకి దిగి కూడా ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌ని నాయ‌కులు ఇంత‌కు రెండు రెట్లు ఉన్నారు. అయితే.. గ‌తంలో గెలిచి, ప్ర‌జానాడిని అంతో ఇంతో ప‌ట్టుకున్న నాయ‌కులు గ‌డ‌ప దాట‌డం లేదు. కానీ, నిరంత‌రం ఓడిన నాయ‌కులు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీలో మేధావి వ‌ర్గాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

ఓడిపోయినంత మాత్రాన వారిలో నాయ‌క‌త్వ ల‌క్షణాలు లేవ‌ని ఎవ‌రూ అనరు. ఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు.. దూకుడుగా ఉన్నారు.. ఉండాలి కూడా! ఈ కోవ‌లోనే జీవీఎల్ న‌ర‌సింహారావు(రాజ్య‌స‌భ ఎంపీ), విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, సోము వీర్రాజు(ఎమ్మెల్సీ) వంటివారి దూకుడును ఎవ‌రూ కాద‌న‌డంలో లేదు. రాజ‌కీయం గా నిత్యంవీరు మీడియాలో క‌నిపిస్తున్నారు. ప్ర‌భుత్వంపైనా ప్ర‌తిప‌క్షంపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే.. వీరు ఆశించిన రేంజ్‌లో ప్ర‌జాభిమానాన్ని సంపాయించుకోలేక పోవ‌డ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. వీరు ఏం మాట్లాడినా.. ప్ర‌జ‌ల నుంచి పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయ‌.

అలా కాకుండా.. అప్పుడో.. ఎప్పుడో.. ఒక్క‌సారైన గెలిచిన నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే.. కొంత ప్ర‌జ‌లు బీజేపీ వైపు చూసే అవ‌కాశం ఉంటుంద‌నేది మేధావి వ‌ర్గం మాట‌. సామాజిక వ‌ర్గాల‌ను పక్క‌న పెడితే.. గెలిచిన నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డ‌మే మానేశారు. విశాఖ ఉత్త‌రం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి వారు వ‌చ్చినా.. ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌ని ఓ సందిగ్థ ప‌రిస్థితి! ఇక‌, కామినేని వంటి కీల‌క నేత‌.. గ‌డ‌ప దాట‌డం లేదు. గోక‌రాజు ఎక్క‌డ ఉన్నారో.. కూడా తెలియ‌డం లేదు. దీంతో బీజేపీలో ఒక విధ‌మైన శూన్య‌త ఆవ‌రించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా వీరు ముందుకు వ‌స్తే.. పార్టీ పుంజుకుంటుంద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఎప్పుడు వ‌స్తారో.. చూడాలి.