ఫాంహౌస్ లో తండ్రికొడుకులు.. ఏకాంత చర్చలు?

దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సొంతం. సెక్రటేరియట్ కు వెళ్లకుండా.. పాలనా రథాన్ని అయితే పామ్ హౌస్ లేదంటే ప్రగతిభవన్ ద్వారా నడిపిస్తున్న వైనంపై తరచూ చర్చకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ.. ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు గులాబీ బాస్.

ఎవరైనా ధైర్యం చేసి అడిగితే.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్. ఆ మాత్రం తెలీదా? అంటూ ఆయన చేసే వ్యంగ్య వ్యాఖ్య ప్రశ్న అడిగిన పాత్రికేయుడికి చురుకు తగలటమే కాదు.. తోటి మిత్రులంతా పెద్ద పెట్టున నవ్వే పరిస్థితి. అందుకే.. ఆయన్ను ప్రశ్నించే కన్నా.. మౌనంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ లో మరో ప్రత్యేకత.. ఆయన ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో.. మరెప్పుడు ఫాంహౌస్ లో ఉంటారన్నది చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే సమాచారం అందుతుంటుంది. అయితే.. రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకొని ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో రివ్యూ సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. అనంతరం ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు.

ఎప్పుడూ జరిగే రోటీన్ సీనే కదా అనేయటానికి లేదు. ఎందుకంటే.. ఈసారి కాస్త భిన్నమైన పరిస్థితి. ఫామ్ హౌస్ కు కేసీఆర్ వెళ్లిన తర్వాత.. మంత్రి కేటీఆర్ కూడా బయలుదేరి వెళ్లారు. అక్కడ తండ్రి కమ్ సీఎం అయిన కేసీఆర్ తో ఏకాంత భేటీ అయినట్లుగా సమాచారం. తండ్రికొడుకుల మధ్య సుదీర్ఘ సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన ఢిల్లీ పర్యటన వివరాల్ని కేటీఆర్ కు చెప్పటంతో పాటు.. పార్టీలో అనుసరించాల్సిన విధానాలపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తండ్రీ కొడుకు ఏకాంత భేటీ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.