బీజేపీ జాతీయ సారథి ఎవరనే విషయంపై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బీహార్కు చెందిన నితిన్ నబీనే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానున్నారు. తాజాగా జాతీయ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ ఎంపీ.. తెలంగాణకు చెందిన కె. లక్ష్మణ్ నేతృత్వంలో నామినేషన్ల స్వీకారం ప్రారంభమైంది. అయితే.. ఈ కార్యక్రమంలో నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన వెంట అగ్ర నాయకులు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా.. పలువురు ఉన్నారు. అదేసమయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాలను బీజేపీ పార్టీ నుంచే తీసుకోవాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్కరే నామినేషన్(బీఫాం) తీసుకున్నారు. అది కూడా నబీనే కావడం విశేషం. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమేనని ఖరారైంది.
షా చెప్పినట్టే..
గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితిన్ నబీన్ పేరు వినిపించింది. కానీ, తనకు సీఎం సీటు ఇస్తేనే పొత్తు అంటూ.. అంతర్గతంగా తేల్చేసిన నితిష్ కుమార్కు.. బీజేపీ ఆ సీటు ఇవ్వక తప్పలేదు. ఆ సమయంలోనే.. కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ నబీన్కు.. అంతకుమించిన పదవిని ఇచ్చేందుకు ప్రధాని మోడీ ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు అదే సాకారం అవుతోందన్నది బీజేపీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ.
ఎవరీ నబీన్?
అసలు పేరు: నితిన్ నబిన్ సిన్హా
పుట్టింది: 23 మే, 1980. బీహార్.
ప్రస్తుత హోదా: గత ఎన్నికల్లో బంకిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
మంత్రిగా: ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు.
కుటుంబం: నితిన్ నబిన్ తండ్రి మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్. ఆయన 2006లో మృతి చెందారు. దీంతో తండ్రివారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికి వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates