దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జ్యూరిచ్లో బిజీ బిజీగా గడిపారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా తో సమావేశమైన ముఖ్యమంత్రి…ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు సీఎం తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఈరోస్ ఇన్నవోషన్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ లు పాల్గొన్నారు. ఈరోస్ జెన్ ఏఐ, ఎరోస్ యూనివర్స్ సూపర్ యాప్, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు తదితర అంశాలను ఈరోస్ ప్రతినిధులు వివరించారు.
‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నట్టు ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్బంగా ‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’ అంటూ.. ఈరోస్ ఇన్నోవేషన్ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా ప్రశంసలు కురిపించారు. తరచుగా దావోస్లో పర్యటిస్తున్నారని, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు.
లోకేష్ కూడా..
ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలను ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి విషయంలో ఏపీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్విట్జర్లాండ్ లోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి ఎంతో అవకాశం ఉందన్నారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు సహకరించాలని సూచించారు.
వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ సిద్దం చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉందన్నారు. ఏపీలో 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, ఈ రంగంలో `బిజినెస్ టు బిజినెస్` పెట్టుబడులను సాకారం చేసేలా సహకరించాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
