ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పెట్టుబడుల వేటకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 19 నుంచి ఆయన మూడు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు వంటివాటిని ప్రధానంగా వివరించనున్నారు. అయితే.. వాస్తవానికి ఎక్కడికి వెళ్లినా.. ఇవే చెబుతున్నారు. అయితే.. తాజాగా ఆయన ఈ వ్యూహాన్ని మార్చనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు గత ఏడాది ఎక్కువగా పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రయత్నించారు. దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలను ఒకే ఏడాదిలో పెట్టుబడులుగా సాధించారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు కావొచ్చు.. విదేశాల పర్యటన ద్వారా కావొచ్చు.. మొత్తంగా భారీమొత్తంలో పెట్టుబడులు తెచ్చారు. ఇవి త్వరలోనే గ్రౌండ్ కానున్నాయి. వాటి ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించనున్నారు.
ఇప్పుడు.. ఈ ఏడాది ప్రారంభంలో 19న ఆయన దావోస్లో పర్యటించనున్నారు. దావోస్లో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. అయితే.. ఈ సారి రాష్ట్రంలో ఉన్న అవకాశాలతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న తీరును.. కేంద్రం ఇస్తున్న రాయితీలను కూడా ఆయన వివరించనున్నారు. కేంద్రంలోనూ తాము అధికారంలో ఉన్నామని.. కేంద్రం నుంచి కూడా భారీ రాయితీలు లభిస్తాయని.. పెట్టుబడిదారులకు చెప్పి.. వారిని ఒప్పించనున్నారు.
తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఉన్న మార్గాలను మరిన్ని పెంచనున్నారు. ఈ దఫా సెమీకండెక్టర్ల రంగంతోపాటు తయారీ రంగానికి కూడా చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు హరిత ఇంధనం, కార్ల విడిభాగాల తయారీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు సెమీ కండెక్టర్, తయారీ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం ద్వారా మెజారిటీ యువతకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates