వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి డాక్టర్ సుధాకర్ను వేధించిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ ఎన్ 90 మాస్క్ను కోరిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలో విధుల్లో పనిచేయాలంటే భయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడమే కాకుండా ప్రభుత్వం ఆయనను తీవ్రంగా వేధించింది. నడిరోడ్డుపై ఆయన చేతులు కట్టేసి పోలీసులు అరెస్టు చేసిన తీరు సభ్యసమాజాన్ని షాక్కు గురి చేసింది. ఆ తర్వాత సుధాకర్ మృతి చెందారు. అయితే ఆయనను వేధించిన ప్రభుత్వం, అనంతరం డాక్టర్గా ఆయనకు రావాల్సిన భత్యాలు, అలవెన్సులను కూడా నిలుపుదల చేసింది. దీంతో ఆయన కుటుంబం పూర్తిగా దుర్దశకు చేరుకుంది.
అంతేకాదు డాక్టర్ సుధాకర్కు టీడీపీ రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచింది. సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
ఆ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే ప్రభుత్వ వైద్యుడిగా ఆయనకు రావాల్సిన అలవెన్సులు, భత్యాలను కూడా విడిగా చెల్లించనున్నారు.
ఇక ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కు పదోన్నతి కల్పించి, గ్రూప్ 2 స్థాయి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తంగా నాడు జగన్ ప్రభుత్వం సుధాకర్ కుటుంబాన్ని రోడ్డున పడేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడం గమనార్హం. గతంలో కూడా పలువురు వైసీపీ పాలనలో బాధితులైన వారికి కూటమి సర్కారు అండగా నిలిచిన ఉదాహరణలు ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates