రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ చేసిన విజ్ఞప్తిపై సీఎంతో చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే రైతులకు చెల్లించే కౌలు పెంపుపై కూడా సీఎం ప్రాథమికంగా అంగీకరించినట్లు వెల్లడించారు.

అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వడ్డమానులో జరిగిన కార్యక్రమంలో తమ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వడానికి సమ్మతి తెలుపుతూ పలువురు గ్రామస్తులు ఫారం–1ను మంత్రికి అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన సహకారాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు వినియోగించనున్నట్లు మంత్రి చెప్పారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతులకు కేటాయించే స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.