జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల

ఏటా జనవరి వస్తోంది.. పోతుంది… సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని సరిపెట్టుకోవడం కాదండీ.. జనవరి వచ్చింది. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్  ఏదీ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

పనిలో పనిగా గత వైసీపీపై కూడా ఆమె సెటైర్లు వేశారు. ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ పార్టీ యువత చెవుల్లో పూలు పెట్టిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందంటూ మండి పడ్డారు.

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు ఆశ చూపి, భారీగా ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం రెండో ఏడాది పూర్తయినా జాబ్ క్యాలెండర్‌పై ఒక్క మాట కూడా చెప్పకపోవడం దుర్మార్గమని షర్మిల ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలని ఆమె అన్నారు.

రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఒక్కదాన్ని కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు. “ఇదిగో అదిగో” అంటూ ఊరించడం తప్ప ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్ ఎక్కడ ఉందని నిలదీశారు. కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదని, అది జోక్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు. నిరుద్యోగ యువతను దగా చేసిన దగా క్యాలెండర్ ఇదని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారని షర్మిల తెలిపారు. కొందరు ఉన్నదంతా అమ్ముకుని మరీ కోచింగ్‌లు తీసుకుంటున్నారని, ఉద్యోగాలు వస్తాయా రావా అనే తీవ్ర ఆందోళనలో యువత ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో కలిపి 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా ఉందని చెప్పారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొలువులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన తాము కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని షర్మిల స్పష్టం చేశారు.