సోనియా గాంధీకి ఏమైంది?

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరడంతో పార్టీ వర్గాల్లో కాస్త ఆందోళన మొదలైంది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకువెళ్లారు. గత నెలలోనే 79లోకీ అడుగుపెట్టిన సోనియా, వయసు రీత్యా తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అసలు ఆమెకు ఏమైందనే దానిపై ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉన్న ‘బ్రాంకియల్ ఆస్తమా’ కొంచెం ఎక్కువైందని తెలిపారు. వాతావరణం మారడం వల్లే ఆమెకు ఈ శ్వాసకోశ సమస్య తలెత్తిందని, ఇది రొటీన్ చెకప్ లో భాగమేనని వైద్యులు చెబుతున్నారు.

అయితే అభిమానులు, కార్యకర్తలు కంగారు పడాల్సిన పనిలేదని వైద్యులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు ఆమె శరీరం బాగా స్పందిస్తోందని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగానే ఆమెను అడ్మిట్ చేసుకున్నామని, యాంటీబయోటిక్స్ మరియు ఇతర మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. మరో ఒకటి రెండు రోజుల్లో ఆమె ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఆమె కోలుకుంటున్న తీరును బట్టి వైద్యుల బృందం డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకోనుంది. ఆమెకు దీర్ఘకాలికంగా దగ్గు సమస్య ఉందని, అందుకే రెగ్యులర్ గా చెకప్ లకు వస్తుంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గతంలో కూడా సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 2025 జూన్ లో తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత సిమ్లాలో కూడా రొటీన్ చెకప్ చేయించుకున్నారు. వయసు మీద పడటం, ఢిల్లీ వాతావరణం సహకరించకపోవడంతో ఆమె ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.