ఎట్టకేలకు ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మీ వచ్చేశారు

ఐఏఎస్ శ్రీలక్ష్మీ… ఈ పేరు వింటేనే ఓ సమర్థవంతమైన అధికారిణి మన కళ్ల ముందు కదలాడతారు. అదే సమయంలో వివాదాల్లో కూరుకుపోయి ఏకంగా జైలుకు వెళ్లి వచ్చిన అధికారిణిగా కూడా ఠక్కున గుర్తుకు వస్తారు. అదంతా గతం అనుకుంటే… ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లోకెక్కిన మహిళా అధికారిణిగా గుర్తుకొస్తారు. అయినా ఇప్పుడు మరోమారు ఈమె ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే.. శుక్రవారం దాకా తెలంగాణ కేడర్ అధికారిణిగా ఉన్న శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీ కేడర్ అధికారిణిగా మారిపోయారు. తెలంగాణ సర్వీస్ కు గుడ్ బై చెప్పేసిన శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీలో కొత్తగా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చోటుచేసుకున్న ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏకంగా జైలుకెళ్లిన శ్రీలక్ష్మీ ఆ తర్వాత చాలా కాలానికి బెయిల్ పై విడుదలయ్యారు. ప్రస్తుతం సదరు కేసు సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా… తనపై పడిన సస్పెన్షన్ ను ఎత్తివేయించుకున్న శ్రీలక్ష్మీ ఏదో అలా పనిచేసుకుంటూ వస్తున్నారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో కొత్తగా వైసీపీ అధికారంలోకి రాగా.. తాను ఏపీ కేడర్ కు వస్తానని సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. అందుకు జగన్ కూడా సరేనన్నారు. అయితే ఓ రాష్ట్రం కేడర్ సీనియర్ ఐఏఎస్ అదికారిణిగా ఉన్న శ్రీలక్ష్మీని మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కేంద్రం అంత ఈజీగా ఒప్పుకోలేదు.

అయితే జగన్ సర్కారుతో సిఫారసు చేయించుకుని కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన శ్రీలక్ష్మీ ఎట్టకేలకు కేంద్రం నుంచి అనుమతి సంపాదించారు. అటు జగన్ విజ్ఝప్తులు, ఇటు శ్రీలక్ష్మీ వేడుకోళ్ల నేపథ్యంలో ఆమెను తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదలాయించేందుకు కేంద్రం ఒప్పుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయిన మరుక్షణమే తెలంగాణ కేడర్ కు రిలీవింగ్ లెటర్ ఇచ్చేసిన శ్రీలక్ష్మీ… శుక్రవారం ఏపీ కేడర్ లో జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం జీఏడీలో రిపోర్ట్ చేసిన శ్రీలక్ష్మీకి త్వరలోనే కీలక పదవి దక్కనుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.