బాబులేరు… బాధ్య‌త తెలుసుకున్నారు!

ఏపీలో జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే అమ‌లు చేసింది. డిసెంబ‌రు 31నే పింఛ‌న్ల‌ను పంపిణీ చేసింది. అయితే.. వాస్త‌వానికి ప్ర‌తి నెలా 1న లేదా.. అంత‌కుముందే నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు హాజ‌రై.. ల‌బ్దిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. పాల్గొని.. వారికి పింఛ‌న్లు అందిస్తున్నారు.

కానీ, ఈ నెల‌లో ఆయ‌న విదేశాల‌కు వెళ్లారు. దీంతో పార్టీ నాయ‌కులు, మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తాను విదేశాల్లో ఉన్నా.. పింఛ‌న్ల పంపిణీ స‌జావుగా సాగాల‌ని సూచించారు.

వాస్త‌వానికి.. ప్ర‌తి నెలా నాయ‌కులు, ఎమ్మెల్యేల‌ను ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, కొంద‌రు పాల్గొంటున్నారు.. మ‌రికొంద‌రు వివిధ కార‌ణాల‌తో డుమ్మా కొడుతున్నారు. ఇక‌, ఈ సారి చంద్ర‌బాబు కూడా ఏపీలో లేక‌పోవ‌డంతో ఎంత మంది హాజ‌రవుతార‌న్న విష‌యంపై సందేహం నెల‌కొంది.

కానీ, ఈ సందేహాన్ని ప‌టాపంచ‌లు చేస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు.. భారీ సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని.. చంద్ర‌బాబు న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టారు. ఫ‌స్ట్ టైమ్ జిల్లాల్లో పింఛ‌న్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, మండ‌ల నాయ‌కులు కూడా పాల్గొన్నారు.

మచిలీపట్నంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ భరోసా పింఛ‌న్ల‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు సంయుక్తంగా పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తున్నాయని పెన్షలని పెంచి వృద్దులకు ప్రతి నెల ఒకటవ తేదీన అందిస్తున్నామని, కానీ జనవరి నెల పెన్షలని ఒక రోజు ముందుగా న్యూ ఇయర్ కానుకగా అందిస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ప్రకాష్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి అచ్చ‌న్నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఏకంగా 18 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆయ‌న ల‌బ్ధిదారుల‌కు పింఛ‌న్ల రూపంలో అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ బదులు డిసెంబర్ 31వ తేదీన, ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.

దేశంలోనే అత్యధిక మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. పొన్నలూరు మండలం రాజోలుపాడు గ్రామంలో లబ్దిదారులకు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు లేక‌పోయినా.. తొలిసారి.. మంత్రులు పింఛ‌న్లు పంపిణీ చేయ‌డం గ‌మ‌నార్హం.