2025.. షర్మిల పొలిటికల్ గ్రాఫ్ ఇదేనా?

ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్‌గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ఏడాది 2025లో ఆమె రాజకీయంగా పుంజుకున్నారా? పార్టీపై పట్టు, నేతలపై అవగాహన సాధించారా? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు, సంవత్సరాల క్యాలెండర్ తిరుగుతుంటే నాయకుల పనితీరుపై అంచనాలు కూడా పెరగాలి. అదే సమయంలో వారి రాజకీయ గ్రాఫ్ కూడా పైకి వెళ్లాలి.

ఈ నేపథ్యంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న షర్మిల గ్రాఫ్ ఈ ఏడాది ఎలా ఉంది? పుంజుకుందా? పతనమైందా? అనే అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించాల్సి వస్తుంది.

1) అధిష్టానంతో చనువు.. స్థానిక నేతలతో దూరం

అధిష్టానంతో షర్మిలకు మంచి చనువు ఉన్నప్పటికీ, పార్టీ లోకల్ నేతలతో ఆమెకు అంతగా అనుసంధానం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. షర్మిల వ్యక్తిగత రాజకీయ శైలిని సీనియర్ నాయకులు చాలా కాలంగా తప్పుబడుతున్నారనే వాదన ఉంది. దీని వల్ల పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానం తగ్గుతోందని కూడా వారు చెబుతున్నారు. అయితే అధిష్టానం వద్ద ఉన్న మద్దతుతో ఆమె సీనియర్లకంటే జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శ కూడా వినిపిస్తోంది.

2) సామాన్యులకు చేరువ కాలేకపోవడం

ఏ పార్టీకైనా ప్రజలే కీలకం. ముఖ్యంగా మహిళా నాయకురాలిగా ఉన్న షర్మిల, మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు మహిళల్లో బలమైన ముద్ర వేయలేకపోయారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.

3) ‘విజిటింగ్ లీడర్’ అనే ముద్ర

పార్టీలోనూ, ప్రజల్లోనూ షర్మిలకు ‘విజిటింగ్ లీడర్’ అనే పేరు బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత విజయవాడలోనే ఉంటానని ఆమె సభల్లో చెప్పారు. ఈ క్రమంలో నెలకు లక్ష రూపాయల అద్దెతో ఓ భవనాన్ని కూడా తీసుకున్నారు. కానీ ఆ భవనానికి అద్దె చెల్లిస్తున్నారే తప్ప, ఇప్పటివరకు షర్మిల అక్కడ పాలు పొంగించలేదు. ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ, అప్పుడప్పుడు విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారనే విమర్శ ఉంది.

మొత్తంగా 2025లో షర్మిల రాజకీయాలు దాదాపు ఇలాగే సాగినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఆమె రాజకీయ గ్రాఫ్ ఎలా ఉందంటే, ఎక్కడికక్కడే అన్నట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.