ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు ఈ విష‌యంలో ఒకింత తాత్సారం చేస్తాయి. కానీ, ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన, మ‌రవైపు ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌జ‌లను త‌మకు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వైసీపీ పుంజుకునే అవ‌కాశాల‌పై ఇటీవ‌ల ఆ పార్టీ దృష్టి పెట్టింది. సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

మ‌రోవైపు.. టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు చేర‌డంలోను, ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేయడంలోనూ ముందున్నాయి. త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌స్తున్నాయి. వివిధ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీ గ్రాఫ్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌లు ఈ విష‌యంలో దూకుడుగానే ఉన్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు కొంత వెనుక బ‌డి ఉంద‌న్న చ‌ర్చ అయితే సాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది.

మూడు విధానాలు అవ‌లంభించాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. 1) గ‌తంలో చేసిన గ‌డ‌ప గ‌డ‌పకు కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించడం. దీని ద్వారా వైసీపీ హ‌వాను పెంచుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సంక్రాంతి త‌ర్వాత‌.. వైసీపీ నుంచి ఈ కార్య‌క్ర‌మం అమ‌లు కానుంది. ఇప్ప‌టికే నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జ‌ల నుంచి సానుభూతి వ‌స్తోంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో గ‌డ‌ప‌-గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ద్వారా మ‌రింత పుంజుకోవాల‌ని భావిస్తున్నారు.

2) జ‌నంతో మ‌మేకం: ఇది వినూత్న కార్య‌క్ర‌మం. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు, స‌భ‌లు నిర్వ‌హించ‌డం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకును కాపాడు కోవాల‌న్నది వైసీపీ వ్యూహం. స్థానిక సమ‌స్య‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు.

3) పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగ‌డం: ఇది ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతున్నా.. ఈ ద‌ఫా మాత్రం పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు.. సంక్రాంతి నుంచి జ‌న‌సేన‌, టీడీపీలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌నున్నాయి. మొత్తంగా మూడు పార్టీల వ్యూహాలు.. ప్ర‌జ‌లను ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తాయో చూడాలి.