బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఈ విషయంపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ విషయంపై తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వారు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. అనర్హత వేసేందుకు ఆధారాలు లేవని, కాబట్టి టెక్నికల్ గా ఆ ఎమ్మెల్యేలంతా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారని క్లీన్ చిట్ ఇచ్చారు.

మొత్తం 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా, 8 మందికి సంబంధించిన విచారణ పూర్తయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి కాలేదు. ఈ అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై ఈ నెల 19న మరోసారి విచారణ జరగనుంది. ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలూ యాదయ్య, సంజయ్ కుమార్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లపై రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో, మిగతా ఐదుగురికి సంబంధించి ఏ విధమైన తీర్పు రాబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది.