తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో బీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సొంత మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఏదో ఒక సమయంలో వెన్నుపోటు పొడవడం ఖాయమని పేర్కొన్నారు.
బీఆర్ ఎస్ పార్టీ నుంచి వంద మందికి పైగా నాయకులను తీసుకుని బయటకు వచ్చేందుకు హరీష్ రావు ప్లాన్ చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. హరీష్ రావుకు కూడా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉందని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పార్టీకి, పార్టీ అధినేతకు కూడా వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడే పరిస్థితి లేదన్నారు. ఈ విషయంలో కేసీఆర్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా కమిటీల ఏర్పాటు విషయమై అధిష్టానంతో మాట్లాడేందుకు మహేష్ కుమార్ ఢిల్లీకి వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ ఎస్కు గేట్లు మూసుకుపోతున్నాయని చెప్పారు. ఈ విషయం తెలిసే కవిత తన సేఫ్ తాను చూసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆమె బయటకు రావడం వెనుక హరీష్ ఉన్నారో లేదో తనకు తెలియదని, కానీ బీఆర్ ఎస్కు భవిష్యత్తు లేదని ఆమెకు అర్థమైందని అన్నారు. ప్రజలు ఛీకొడుతున్నారని గ్రహించి, అందుకే బయటకు వచ్చి సొంత రాజకీయాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులతో ఏదైనా మేనేజ్ చేయగల దిట్ట అని మహేష్ కుమార్ విమర్శించారు. ప్రస్తుతం సోషల్ మీడియాను కూడా కేటీఆర్ డబ్బులతో మేనేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పుంజుకోదని, మరిన్ని గొడవలు పెరుగుతాయని జోస్యం చెప్పారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారని తెలిపారు.మా అభివృద్ధి మంత్రమే మమ్మల్ని గెలిపిస్తుంది అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates