రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేకరించిన సంతకాల పత్రాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు వాహన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీ నేతలు ఏపీ డీజీపీకి లేఖ సమర్పించారు. ఈ నెల 15న అన్ని జిల్లా కేంద్రాల నుంచి వాహన ర్యాలీల రూపంలో సంతకాల పత్రాలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ వాహన ర్యాలీ నిర్వహణకు వైసీపీ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
ర్యాలీ సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, కార్యక్రమం సజావుగా సాగేలా పోలీసు శాఖ సహకారం, భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. విజయవాడకు సంతకాల పత్రాలు చేరుకున్న అనంతరం, ఈ నెల 18న గవర్నర్కు వాటిని అధికారికంగా అందజేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
కోటి సంతకాల ర్యాలీ ద్వారా పార్టీ తన ఉనికిని మరింత బలంగా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గాలకు టార్గెట్లు నిర్దేశించి సంతకాల సేకరణ పూర్తిచేశారనే ప్రచారం ఉండగా, ఇప్పుడు ఒకే రోజు ఏపీ వ్యాప్తంగా వాహనాలను తాడేపల్లికి తరలించి విస్తృత ప్రచారం పొందాలన్న వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వైసీపీ రూపకల్పన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాహన ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates