ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)కి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల సంబంధిత ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన కౌంటర్‌లో పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ఆస్తులన్నీ తన స్వార్జితమని స్పష్టం చేసిన ఆయన, ఈ మేరకు ఎన్‌సీఎల్‌ఏటీలో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేశారు.

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై గతంలో వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేశారు. తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్‌ విజయమ్మ పేరుపైకి బదిలీ చేశారని ఆరోపిస్తూ, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై వైఎస్‌ షర్మిల అప్పీల్‌ చేయడంతో, ఆమెకు ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవన్నారు. అప్పీల్‌ చేసే అర్హత కూడా లేదని జగన్‌ తన కౌంటర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో గతంలో భవిష్యత్తులో ఆస్తులు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదిరిందని జగన్‌ తెలిపారు. అయితే ఆ మేరకు జరిగిన వాటాల బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్‌ చేయడం వెనుక ఉద్దేశాలపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు జగన్‌ ఉంచారు.